పెద్ద వాగు, కప్పల వాగుపై నిర్మాణానికి రూ.57.9 కోట్లు మంజూరు
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా..
బాల్కొండపై కేసీఆర్ ప్రేమకు నిదర్శనం
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మర్పల్లి, జూన్ 13 : బాల్కొండ నియోజక వర్గంలోని పెద్ద వాగు, కప్పల వాగుపై కొత్తగా ఏడు చెక్ డ్యాములు మంజూరయ్యాయి. రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య మంత్రి కేసీఆర్ సహకారంతో పెద్ద వాగు, కప్పల వాగుపై ఇప్పటికే పెద్ద ఎత్తున చెక్ డ్యాములను మంజూరు చేయించారు. వాటిలో పలుచోట్ల నిర్మాణాలు పూర్తి కాగా వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయి. మరికొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రెండు వాగులపై చెక్ డ్యాముల నిర్మాణాలు కొనసాగుతుండగానే కొత్తగా మరో ఏడు చెక్ డ్యాములు మంజూరయ్యాయి.
తాజాగా మంజూరైన ఈ ఏడు చెక్ డ్యాముల నిర్మాణానికి రూ.57.9 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ బాల్కొండ నియోజకవర్గ రైతు బాంధవుడని, ఇది ఇక్కడి ప్రజల మీద ఆయనకు ఉన్న ప్రేమ కు నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలే బాల్కొండ నియోజక వర్గంలోని భీమ్గల్లో వంద పడకల దవాఖాన మంజూరు చేసిన కేసీఆర్.. నేడు రూ.57.9 కోట్లతో ఏడు చెక్ డ్యాముల నిర్మాణానికి మంజూరు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి, రైతు నాయకుడు దివంగత వేముల సురేందర్ రెడ్డి ఆశయాలు, ఈ ప్రాంత ప్రజల కోరిక తెలిసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
మంజూరైన చెక్ డ్యాములు ఇవే
కొత్తగా మంజూరైన చెక్ డ్యాములను పెద్ద వాగులో మోర్తాడ్ మండలం శెట్పల్లి వద్ద రూ.8.46 కోట్లు, మోర్తాడ్ మండలం పాలెం-దొన్కల్ గ్రామాల మధ్య రూ.11.24 కోట్లు, వేల్పూర్ మండలం రామన్నపేట్ వద్ద రూ.8.61 కోట్లు, వేల్పూర్ మండలం వేల్పూర్-జాన్కంపేట్ మధ్య రూ.7.45 కోట్లు, కప్పలవాగులో భీమ్గల్ మండలం సాలంపూర్-సికింద్రాపూర్ మధ్య రూ.9.38 కోట్లు, మెండోరా మండలం వెల్కటూర్ గ్రామం వద్ద రూ.6.26 కోట్లతో నిర్మించనున్నారు. కొత్తగా మరో ఏడు చెక్ డ్యాముల మంజూరులో నియోజక వర్గంలోని పెద్ద వాగు, కప్పల వాగులకు ఇరు వైపులా పరీవాహక గ్రామాలు, భూముల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా ప్రాంతాల రైతులు మంత్రి వేములను చెక్డ్యాముల ప్రశాంత్రెడ్డి అని అభిమానంతో వ్యాఖ్యానిస్తున్నారు.