న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం రూ.4500 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలుసు కదా. ఇందులో రూ.3 వేల కోట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు, మరో రూ.1500 కోట్లు భారత్ బయోటెక్కు ఇవ్వనున్నారు. అయితే కేంద్రం నుంచి ఆ రూ.3 వేల కోట్లు వస్తాయని తాము నమ్ముతున్నామని, అందుకే వాటి కోసం వేచి చూడకుండా వెంటనే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచామని సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు.
తమ వ్యాక్సిన్ కొవిషీల్డ్ ధరలను బుధవారం సీరమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రాలకైతే డోసు రూ.400కు, ప్రైవేట్ హాస్పిటల్స్కైతే రూ.600కు అమ్మనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మరోవైపు మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్రం ప్రకటించడంతో నెలకు అవసరమైన వ్యాక్సిన్ల సంఖ్య భారీగా పెరగనుంది. అందుకు తగినట్లు తాము ఉత్పత్తిని పెంచామని అదర్ పూనావాలా తెలిపారు.
జులైలోగా నెలకు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తామన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. మీడియాలో పదేపదే చూపిస్తున్న రూ.3 వేల కోట్ల మొత్తం మంజూరైంది. ఆ మొత్తం త్వరలోనే మాకు అందుతుందని మేము నమ్మాము. దాని కోసం వేచి చూడకుండా ముందుగానే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాము అని పూనావాలా చెప్పారు.
ఇండియాలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ఎగుమతిని కేంద్రం నిలిపివేసింది. జులై వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని పూనావాలా అభిప్రాయపడ్డారు. ఈ మధ్యే వ్యాక్సిన్ ముడి సరుకులపై నిషేధం ఎత్తేయాలని కోరుతూ ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ట్వీట్ కూడా చేశారు.