ఖలీల్వాడి, జూలై 19:ప్రస్తుత కరోనా కాలంలో షుగర్ అదుపులో లేనివారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు స్టెరాయిడ్లను వినియోగించే వారిపై బ్లాక్ ఫంగస్తోపాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తున్నాయని డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తున్నది. షుగర్ వ్యాధిగ్రస్తులకు కొవిడ్ సోకడం ద్వారా ఇతర ఇన్ఫెక్షన్లు కూడా దాడి చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. షుగర్, స్టెరాయిడ్లు వాడే వారు కరోనా బారినపడితే అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వైద్యులను వెంటనే సంప్రదించాలని, ఇన్ఫెక్షన్లు సోకకుండా వైద్యం చేయించుకో వాలని స్పష్టం చేసింది. సాధారణంగా మానవ శరీరంలో ఇన్వాసివ్ ఫంగస్, బ్యాక్టీరియా ఉంటుందని, మరోవైపు వివిధ రకాల బాహ్య పరిస్థితుల కారణంగా సంభవించే కొలనైజేషన్ ఇన్ఫెక్షన్లు ఉంటాయని పేర్కొన్నది. అయితే ఇవి సాధారణ సమయాల్లో అంతగా అనారోగ్యాన్ని కలిగించవని, కానీ ప్రస్తుత కరోనా కాలంలో ఇన్యాక్టివ్ ఫంగస్లు యాక్టివ్ అవుతున్నట్లు గుర్తించామని వెల్లడించింది. క్యాన్సర్తో బాధపడుతున్నవారు, అవయవ మార్పిడి చేసుకున్న వారు, శరీరంలో ఐరన్ శాతం పెరిగి చికిత్స పొందుతున్న వాళ్లు, షుగర్ సరైన మోతాదులో లేనివారు కొవిడ్ -19 కాలంలో జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్వో సూచిస్తున్నది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ముప్పు ఎక్కువ..
షుగర్ ఉన్నవాళ్లు, స్టెరాయిడ్లు వాడేవారు కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. కరోనా సోకి, ప్రాథమిక దశలోనే బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ను కూడా చికిత్స ద్వారా నివారించగలిగే విధానంపై రాష్ట్రంలోని వైద్యులకు అవగాహన ఏర్పడింది.
షుగర్ రెండు రకాలు..
షుగర్ రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సాధారణ షుగర్, రెండోది బ్లడ్ షుగర్. సాధారణ షుగర్వ్యాధిగ్రస్తులు వైద్యులను సంప్రదించి మందులను వాడితే నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ షుగర్ ఉన్నవారికి గంటకోసారి ఆకలి అవుతుంది. అది రాత్రి, లేదా పగలు కావొచ్చు. ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్లకు దెబ్బ తగిలితే తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు చేశాం..
నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్కు చికిత్స చేస్తున్నాం. ఇప్పటికే రెండు కేసులను విజయవంతంగా పూర్తి చేశాం. ఎక్కువగా కేసులు నమోదు కాకపోవడంతో భయపడాల్సిన అవసరం లేదు. దవాఖానలో బ్లాక్ ఫంగస్కు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం.
-డాక్టర్ ప్రతిమారాజ్, సూపరింటెండెంట్ (జీజీహెచ్, నిజామాబాద్)
ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు..
ముందుగా గుర్తిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపులో ఉండేలా చూసుకోవాలి. రోగనిరోధకశక్తి పెంచుకునేందుకు సమతులాహారం తీసుకోవాలి. బ్లాక్ఫంగస్ అందరికీ రాదు.
-డాక్టర్ రాజేశ్వర్, ఛాతి వైద్య నిపుణుడు