కాప్-26 సదస్సును నవంబర్ తొలి వారంలో ఎక్కడ నిర్వహించారు? (సి) ఎ) రియో డిజనీరో బి) క్యోటో సి) గ్లాస్గో డి) పారిస్ వివరణ: కాప్-26 సదస్సును స్కాట్లాండ్లో అతి ఎక్కువ జనాభా కలిగిన గ్లాస్గో నగరంలో నవంబర్ తొలి వారంలో నిర్వహించారు. పర్యావరణ అనుకూల జీవన శైలిని ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ అన్న భావనను అంతర్జాతీయ నేతల ముందు ఆయన ప్రతిపాదించారు. ప్రపంచ జనాభాలో 17% వాటాను కలిగి ఉన్న భారత్ ఉద్గారాల్లో మాత్రం కేవలం 5% కలిగి ఉండటాన్ని గమనించాలని వెల్లడించారు. సౌరశక్తిని మానవాళి మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని కోరారు.
ఇండియా గ్రీన్ గ్యారెంటీ దేనికి సంబంధించింది? (ఎ) ఎ) భారత్లో హరిత ప్రాజెక్ట్లు చేపట్టేందుకు ప్రపంచ బ్యాంక్కు యూకే ఇచ్చిన గ్యారెంటీ బి) వివిధ చిన్న దేశాల్లో పర్యావరణ అనుకూల ప్రాజెక్ట్ల కోసం భారత్ ఇచ్చే రుణం సి) పర్యావరణ పరంగా భారత్ సాధించాల్సిన లక్ష్యాలు డి) ఏదీకాదు వివరణ: భారత్లో హరిత ప్రాజెక్ట్ల కోసం అదనంగా 75 కోట్ల పౌండ్లు అందుబాటులోకి రానున్నాయి. యూకే ఇచ్చిన గ్యారెంటీతో ప్రపంచ బ్యాంక్ ఈ మొత్తాన్ని భారత్కు ఇవ్వనుంది. వీటితో పర్యావరణ అనుకూల ప్రాజెక్ట్లను భారత్ చేపట్టాల్సి వస్తుంది. దీనివల్ల శుద్ధ ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో పర్యావరణ అనుకూల, మౌలిక వసతులకు నిధులు లభిస్తాయి. దీనికి తోడు ప్రైవేట్ మౌలిక వసతుల అభివృద్ధి బృందం ద్వారా వర్ధమాన దేశాల్లో పర్యావరణ అనుకూల ప్రాజెక్ట్లకు 21 కోట్ల డాలర్ల పెట్టుబడులకూ బ్రిటన్ సమ్మతించింది. దీని కింద భారత్లో విద్యుత్ వాహనాల ప్రాజెక్ట్లకు కూడా నిధులు అందుతాయి.
2021ని ఏ సంవత్సరంగా ఎఫ్ఏవో ప్రకటించింది? (బి) ఎ) అంతర్జాతీయ సహకార రంగ సంవత్సరం బి) పండ్లు, కూరగాయల అంతర్జాతీయ సంవత్సరం సి) స్థానిక భాషల అంతర్జాతీయ సంవత్సరం డి) అంతర్జాతీయ శాంతి సాధన సంవత్సరం వివరణ: 2021 సంవత్సరాన్ని అంతర్జాతీయ పండ్లు, కూరగాయల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రకటించింది. ఇటలీలోని రోమ్ కేంద్రంగా ఫుడ్ అండ్ అగ్చికల్చర్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. పండ్లు, కూరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరాన్ని ఎంపిక చేశారు. తమ రోజువారీ ఆహార మెనూలో తీసుకోవడం వల్ల అందే పోషక విలువల గురించి తెలియజేస్తారు. అలాగే 2019ని స్థానిక భాషల సంవత్సరంగా నిర్వహించారు. చెట్ల ఆరోగ్య పరిరక్షణ సంవత్సరంగా 2020ని, అంతర్జాతీయ సహకార రంగ సంవత్సరంగా 2012ని నిర్వహించారు.
ఏ ప్రాంతంలో కంటెయినర్ ఆధారిత ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది? (డి)
హైదరాబాద్ 2. ఢిల్లీ
చెన్నై 4. పుణె ఎ) 1, 2 బి) 2, 4 సి) 3, 4 డి) 2, 3 వివరణ: ఢిల్లీ, చెన్నైలలో కంటెయినర్ ఆధారి ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆసియాలోనే ఈ తరహా ఆస్పత్రులు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి కంటెయినర్ల ఆధారంగా పనిచేస్తాయి. ఎక్కడికయినా తీసుకెళ్లేందుకు వీలుంటుంది. 100 పడకలు ఇందులో ఏర్పాటు చేయనున్నారు. రైళ్లు లేదా విమాన మార్గం ద్వారా అత్యవసర పరిస్థితిలో ఎక్కడికయినా తీసుకెళ్తారు.
అంతర్జాతీయ విత్తన సదస్సులో పాల్గొనేందుకు భారత్ నుంచి ఏ రాష్ర్టానికి ఆహ్వానం అందింది? (సి) ఎ) పంజాబ్ బి) ఒడిశా సి) తెలంగాణ డి) ఉత్తర్ప్రదేశ్ వివరణ: ప్రపంచ విత్తన భాండాగారంగా పేరు సాధించిన తెలంగాణ రాష్ర్టానికి అరుదైన గౌరవం లభించింది. ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లో ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. నవంబర్ 4, 5 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించారు. ‘ఏ సక్సెస్ స్టోరీ యాజ్ ఏ గ్లోబల్ సీడ్ హబ్’ అనే నేపథ్యంలో తెలంగాణ పాల్గొన్నది. అంటే ప్రపంచ విత్తన భాండాగారం, ఒక విజయవంతమైన గాధగా భావించవచ్చు.
ఈ ఏడాది బుకర్ ప్రైజ్ను పొందిన డామన్ గాల్గట్ ఏ దేశానికి చెందినవాడు? (బి) ఎ) యూకే బి) దక్షిణాఫ్రికా సి) ఫ్రాన్స్ డి) స్పెయిన్ వివరణ: సాహిత్య పురస్కారాల్లో ప్రతిష్టాత్మకమైన బుకర్ పురస్కారాన్ని 2021కు గాను డామన్ గాల్గట్కు లభించింది. ఆయన దక్షిణాఫ్రికా దేశానికి చెందినవాడు. ఆ దేశంలో ఈ బహుమతిని పొందిన మూడో వ్యక్తి ఆయన. ఈ అవార్డ్ను 1969లో ప్రవేశపెట్టారు. 1969 నుంచి 2001 వరకు దీనిని ‘బుకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్’ అనే పేరుతో పిలిచేవాళ్లు. 2002 నుంచి 2019 వరకు మ్యాన్ బుకర్ ప్రైజ్ పేరుతో ఉంది. తాజాగా దీనిని బుకర్ ప్రైజ్ అంటున్నారు. 1997లో భారత్కు చెందిన అరుంధతీ రాయ్ ఈ బహుమతిని పొందారు. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికిగాను ఆమె పురస్కారాన్ని దక్కించుకున్నారు. డామన్ గాల్గట్ ‘ది ప్రామిస్’ అనే పుస్తకానికి ఈ ప్రైజ్ను పొందారు.
‘గౌంగ్ము’ ఇటివల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి) ఎ) కొత్త క్షిపణి బి) గ్లాస్గో సమావేశాల్లో ఏర్పాటైన కొత్త కూటమి సి) భూ విజ్ఞాన ఉపగ్రహం డి) ఏదీకాదు వివరణ: గౌంగ్మూ భూ విజ్ఞాన ఉపగ్రహాన్ని నవంబర్ 5న చైనా విజయవంతంగా ప్రయోగించింది. లాంగ్ మార్చ్-6 వాహన నౌక ద్వారా దీనిని తియాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి అంతరిక్ష కేంద్రానికి పంపింది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఉద్దేశించింది ఇది. ఈ లక్ష్యాల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. శక్తి వినియోగం, తీర ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం తదితర అంశాలపై ఈ ఉపగ్రహం సమాచారాన్ని సేకరిస్తుంది.
దేశంలో తొలి రూఫ్టాప్ డ్రైవ్ ఇన్ థియేటర్ను ఏ నగరంలో ప్రారంభించారు? (డి) ఎ) నాసిక్ బి) సిమ్లా సి) కాన్పూర్ డి) ముంబయి వివరణ: దేశంలో తొలి రూఫ్టాప్ డ్రైవ్ ఇన్ థియేటర్ను ముంబయిలో నవంబర్ 5న ప్రారంభించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ 290 కార్లను పార్కింగ్ చేసుకొనే సౌకర్యం ఉంటుంది. సినిమా స్క్రీన్ 24మీX 10మీ కొలతల్లో ఉంటుంది. అంటే దేశంలో అతిపెద్ద స్క్రీన్లలో ఇది కూడా ఒకటి. ఒక్కో కార్కు టికెట్ రూ.1200, ఒక్క కారులో నలుగురికి అనుమతి ఇస్తారు. ఈ థియేటర్లో ప్రదర్శించిన మొదటి చిత్రం సూర్యవంశ్.
‘ఆయుష్మాన్ సీఏపీఎఫ్’ దేనికి సంబంధించింది? (సి) ఎ) ఆస్పత్రుల నిర్మాణం బి) అందరికీ కరోనా టీకాలు ఇవ్వడం సి) కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు హెల్త్ కార్డ్లు ఇవ్వడం డి) సాయుధ బలగాలకు అందరికీ ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వడం వివరణ: కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు హెల్త్ కార్డ్లు ఇచ్చారు. ఈ పథకానికి పెట్టిన పేరే ‘ఆయుష్మాన్ సీఏపీఎఫ్’. సీఏపీఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఇందులో పనిచేసేవాళ్లు, వాళ్లపై ఆధారపడిన వాళ్లకు వైద్య సేవలు ఈ పథకంలో భాగంగా అందిస్తారు. కేంద్ర హోం, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలతో పాటు నేషనల్ హెల్త్ అథారిటీలు సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. ఈ సంవత్సరం చివరి నాటికి 35 లక్షల కార్డులను ఉద్యోగులను ఇవ్వనున్నారు. సీఏపీఎఫ్లో మొత్తం ఏడు బలగాలు ఉంటాయి. అవి అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సహస్ర సీమాబల్.
కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ, ఫ్లిప్కార్ట్లు ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కారణం ఏంటి? (బి) ఎ) గ్రామాల్లో వివిధ ఉత్పత్తులను ఫ్లిప్కార్ట్ ద్వారా అందివ్వడానికి బి) గ్రామాల్లోని స్థానిక వ్యాపారుల ఉత్పత్తుల విక్రయానికి సి) గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు డి) ఏదీకాదు వివరణ: దీన్దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ, ఫ్లిప్కార్ట్లు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా గ్రామాల్లోని స్థానిక వ్యాపారులు, అలాగే స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ఫ్లిప్కార్ట్ మార్కెట్ కల్పిస్తుంది. ఆయా ఉత్పత్తులను ఈ-కామర్స్ ప్లాట్ఫాం పరిధిలోకి తెస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, చేతి వృల్లి కళాకారులు, చేనేతకారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
ఏ సంవత్సరం నాటికి భారత్ సున్నా ఉద్గారాల స్థాయిని అందుకుంటుందని ప్రధాని ప్రకటించారు? (డి) ఎ) 2030 బి) 2040 సి) 2060 డి) 2070 వివరణ: 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను 1 బిలియన్ టన్నుల మేర తగ్గించడంతో పాటు 2070 నాటికి సున్నా ఉద్గారాల స్థాయిని అందుకుంటుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. 2030 నాటికి శూన్య ఉద్గార స్థాయికి రైల్వే శాఖ చేరుకుంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. కాప్-26 సదస్సు సందర్భంగా ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.