సివిల్ సర్వీసెస్ పోస్టుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. గతేడాది 712 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వగా ఈసారి 1011 పోస్టులను భర్తీ చేయనుంది యూపీఎస్సీ. గతేడాదితో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య వందకు పైగా పెరిగింది. పోస్టుల సంఖ్య పెరగడమంటే అభ్యర్థులకు విజయావకాశాలు మెరుగైనట్లే లెక్క. ఈ నేపథ్యంలో జూన్ 5న జరుగనున్న ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి? మెరుగైన ఫలితం కోసం అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? ఏ సబ్జెక్టుకు ఎలాంటి విధానం అనుసరించాలి? ఇలా అన్ని అంశాలని సమగ్రంగా తెలుసుకుందాం.
సివిల్స్ సర్వీసెస్ సాధించడం అనేది దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థుల కల. వివిధ రకాల విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు, వివిధ స్థాయిల్లో ప్రిపరేషన్ ప్రారంభిస్తుంటారు. అయితే స్థూలంగా విభజించినప్పుడు సివిల్స్ కోసం ప్రిపేరయ్యే అభ్యర్థులు రెండు రకాలు.
1. చాలా కాలం నుంచి ప్రిపేరవుతూ ఇప్పటికే కనీసం ఒకసారైనా పరీక్ష రాసినవారు.
2. ఈ ఏడాదే మొదటిసారి పరీక్ష రాయబోతున్నవారు.
గత అనుభవాన్ని విశ్లేషించుకోండి
ఇప్పటికే ఒకసారైనా పరీక్ష రాసిన అభ్యర్థులకు స్వీయ విశ్లేషణ చాలా కీలకం. గతంలో పరీక్షని ఎలా ఎదుర్కొన్నారు? అది ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ఒకవేళ గతంలో ప్రతికూల ఫలితం వచ్చి ఉంటే దానికి కారణాలేంటనేది గమనించండి. ఇప్పుడు రాబోయే పరీక్షకు సంబంధించి మళ్లీ ఆ తప్పులు దొర్లకుండా ప్రయత్నించండి. ఉదాహరణకు గతంలో సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్ల విఫలమయ్యాం అని అనుకుంటే ఈసారి ప్రాక్టీస్పై ఎక్కువ దృష్టి పెట్టండి. గతంలో రివిజన్ సరిగా జరగలేదనుకుంటే ఇంకా ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది. కాబట్టి ముందు రివిజన్పై, తర్వాత ప్రాక్టీస్పై దృష్టి సారించండి. గుర్తుంచుకోండి గెలవడానికి అవసరమైన సమయం ఇంకా మీ చేతుల్లోనే ఉంది.
మొదటి ప్రయత్నం బలంగా ఉండాలి
ఈ ఏడాదే మొదటిసారిగా పరీక్ష రాస్తున్న అభ్యర్థులు సహజంగానే కొంత ఆందోళనతో ఉంటారు. కానీ ఆందోళనకు గురికానవసరం లేదు. ఉన్నత లక్ష్యం కోసం వేస్తున్న మొదటి అడుగు ఇది. కాబట్టి సమయాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోండి. ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లండి. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నారనే విషయం గుర్తుంచుకోండి.
ప్రణాళిక ఎలా ఉండాలి?
ముందుగా ఈ పరీక్ష కోసం చదవాల్సిన సబ్జెక్టులు, వాటిని చదవడానికి ఉన్న సామర్థ్యం, పరీక్షకు ఉన్న సమయం, ఇలా అన్ని అంశాలను బేరీజు వేసుకుని, వ్యక్తిగతంగా ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళిక ఎలా ఉండాలంటే పరీక్ష లోపు ఒక్కో సబ్జెక్టు కనీసం ఒకసారైనా పూర్తి చేయాలి. అలా ప్రణాళికలో సిలబస్లో ఉన్న అన్ని సబ్జెక్ట్లు చదివేలోగా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి. ఉన్న సమయంలో కేవలం చదవడం మాత్రమే కాదు, ప్రాక్టీస్కు కూడా ప్రణాళికలో చోటు ఉండాలి.
ఏ సబ్జెక్టుని ఎలా చదవాలి?
చరిత్ర
సాధారణంగా భారతీయ చరిత్రని ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రలుగా విభజిస్తాం. అభ్యర్థుల్లో చాలామంది ఆధునిక చరిత్రపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. ప్రాచీన, మధ్యయుగ చరిత్రలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అవి కష్టమని భావించడమే దీనికి కారణం. దీంతోపాటు యుద్ధాలు, సంవత్సరాలు ఏవేవో గుర్తుపెట్టుకోవాలనే అపోహతో ఉంటారు. ఈ విషయంపై కాస్త అవగాహన ఉన్న అభ్యర్థులు కూడా ఈ సబ్జెక్ట్ విస్తృతి ఎక్కువ కదా.. ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని వదిలేస్తుంటారు. కానీ ఇటీవలి ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రాచీన, మధ్యయుగ భారత దేశ చరిత్ర నుంచే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఆధునిక భారత దేశ చరిత్రతోపాటు ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే ఈ సబ్జెక్ట్ని ఒక్కసారైనా చదివి ఉంటారు. కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ని వివిధ ముఖ్యమైన అంశాల వారీగా విభజించుకోండి. ఉదాహరణకు గ్రంథాలు- రచయితలు, ఆలయాలు, వాస్తు/శిల్పకళ, మతం, వాటికి సంబంధించిన అంశాలు ఇలా కీలక అంశాలను గుర్తించి వాటిని రివిజన్ చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను, ముఖ్యంగా ఇటీవలి ప్రశ్నపత్రాలను గమనిస్తే ప్రశ్నల శైలి అర్థం అవుతుంది. దానిని బట్టి ప్రిపరేషన్ మరింత సులభమవుతుంది. ఆధునిక భారత దేశ చరిత్ర విషయానికి వస్తే ప్రిలిమ్స్తోపాటు మెయిన్స్ పరంగా కూడా విభాగం కీలకం. వలస పాలన, స్వాతంత్రోద్యమం, సామాజిక సంస్కరణోద్యమాలు ఇలా ఒక్కో అంశాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. ఇలా సబ్జెక్ట్ను చదువుతుండటంతోపాటు వార్తల్లో ఉన్న అంశాలకు వాటిని అనుసంధానం చేసుకుని చదవాలి. ఉదాహరణకు సమతామూర్తి అంశం వార్తల్లో చూసినప్పుడు భక్తి ఉద్యమంపై శ్రద్ధపెట్టాలి.
పాలిటీ
పాలిటీ సిలబస్ విస్తృతంగా కనిపించినప్పటికీ సులభంగా చదవచ్చు. కానీ ప్రశ్న ఎదుర్కొన్నప్పుడు అభ్యర్థి తడబడటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్న సబ్జెక్టు. దీనికి ఉన్న పరిష్కారం, ప్రాథమిక అంశాలపై పట్టు కలిగి ఉండటం, అలాగే ప్రధాన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం, ఉదాహరణకు రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పార్లమెంటరీ విధానం ఇలాంటి అంశాలపై పట్టు సాధించాలి. వీలైనన్నిసార్లు సబ్జెక్ట్ను రివిజన్ చేయాలి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ పై ఎక్కువ ఫోకస్ చేయాలి. పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్పై ఎక్కువ దృష్టి సారించాలి.
జాగ్రఫీ
ఈ సబ్జెక్టులో ప్రతి ఏడాది ఆశించిన స్థాయిలో మార్కులు వస్తుంటాయి. ఒకసారి ప్రాథమిక అంశాలు తెలిస్తే చాలు ఈ సబ్జెక్టు నుంచి వచ్చే ప్రశ్నలని ఎదుర్కోవడం సులభం. జాగ్రఫీకి సంబంధించి గత ప్రశ్నపత్రాలు గమనిస్తే.. వర్తమానంలో వార్తల్లో ఉన్న అంశాలను ప్రాథమిక అంశాలకు జోడించి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఈ సబ్జెక్టు విషయంలో కూడా కరెంట్ అఫైర్స్ కీలకమైన అంశం అని గుర్తించాలి.
ఎకానమీ..
కాస్త సాంకేతికత ఇమిడి ఉన్న సబ్జెక్టు ఇది. అందుకే కచ్చితంగా బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. లేకపోతే వాటి అనువర్తనాలు అసలు అర్థం కావు. కానీ ఒకసారి పట్టు సాధించామంటే మ్యాథ్స్ మాదిరిగా ఈ సబ్జెక్ట్ను కూడా అలవోకగా ఎదుర్కోవచ్చు. ఎకానమీ సబ్జెక్ట్ విషయంలోనూ కరెంట్ అఫైర్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. వాటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకోవాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఈ రెండూ ట్రెండింగ్ సబ్జెక్ట్స్. సాధారణంగా ఆర్ట్స్ బ్యాగ్రౌండ్ ఉన్న అభ్యర్థులు ఇవి కాస్త కష్టం అనుకుంటారు. కానీ బేసిక్స్ నుంచి మొదలుపెడితే వీటిని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. అంతేకాకుండా ఈ రెండు సబ్జెక్టులను అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ప్రతి పరీక్షలోనూ వీటికి గణనీయమైన ప్రాధాన్యం ఇస్తున్నారు.
కరెంట్ అఫైర్స్ని ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వ పథకాలు, ఇతర చొరవలు, నిర్ణయాలు, రాష్ట్రం, జాతీయం, అంతర్జాయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇలా వివిధ అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. కరెంట్ అఫైర్స్ విభాగం కచ్చితంగా శ్రమకు తగిన ఫలితాన్ని ఇస్తుంది.
CSAT
సివిల్స్ పరీక్షకు సంబంధించి జనరల్ స్టడీస్పై పట్టు ఉన్నప్పటికీ కొంతమంది అభ్యర్థులు సీశాట్ లో క్వాలిఫయింగ్ మార్కులు సాధించలేకపోవడం వల్ల పరీక్షను చేజార్చుకుంటున్నారు.
యూపీఎస్సీ గత ప్రశ్నపత్రాలను గమనించి ఆ కోణంలో ప్రాక్టీస్ చేస్తే ఈ పేపర్లో సులభంగా క్వాలిఫై కావచ్చు. ఈ పేపర్కు ప్రత్యేకంగా కావాల్సింది ప్రాక్టీస్. కనీసం రోజుకు గంటసేపైనా ప్రాక్టీస్ చేయడం మంచిది.
ప్రాక్టీస్కు ప్రాధాన్యం
ప్రిపరేషన్ ఎంత కీలకమో, చదివిన అంశాలను రివిజన్ చేయడం అంతే కీలకం. చదివిన అంశాలనే పదే పదే చదివితే అది సరైన రివిజన్ కాదు. ఒకటికి రెండు సార్లు చదివిన సబ్జెక్టులకు సంబంధించి రోజూ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా రివిజన్ అవుతుంది. దీంతో పాటు సబ్జెక్టుపై మనకున్న సామర్థ్యం కూడా తెలుస్తుంది. దీని ద్వారా ఆయా అంశాలపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. పరీక్ష రాసే సమయానికి నిపుణత పెరుగుతుంది. ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి వివిధ కోచింగ్ సెంటర్లు నిర్వహించే టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా పరీక్ష ఎదుర్కొనే నైపుణ్యం తెలుస్తుంది. ఏ ప్రశ్నని ఆన్సర్ చేయాలి? ఏ ప్రశ్నని వదిలేయాలి? ఏ ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి ఇలా పరీక్ష రాయడానికి అవసరమైన నైపుణ్యం ఏర్పడుతుంది.
మిమ్మల్ని మీరు జయించాలి
నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మొదలుకుని పరీక్ష సమయం దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల్లో సాధారణంగానే ఒక రకమైన ఆందోళన ఏర్పడుతుంది. దీనివల్ల విలువైన సమయం వృథా అవుతుంది. కాబట్టి పరీక్ష గురించి ఆలోచించడం తగ్గించి, సబ్జెక్ట్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం ముఖ్యమైన అంశం.
-మల్లవరపు బాలలత,సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,హైదరాబాద్