హైదరాబాద్: ఆదివారం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షకు ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు తెలిపారు. అభ్యర్థులంతా నిర్ధేశిత సమయానికే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పేపర్-1కు ఉదయం 9: 30 గంటలు, పేపర్-2కు మధ్యాహ్నం 2 : 30 గంటల తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా జరుగనుంది. ఈ పరీక్ష నిర్వహణకుగానూ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జామ్ను బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతోనే రాయాల్సి ఉంటుందని, అభ్యర్థులు రెండు పెన్నులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష ముగిసే వరకూ అభ్యర్థులంతా పరీక్షా హాల్లోనే ఉండాలని, మధ్యలో బయటికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఎస్సెస్సీ ముల్యాంకనం కొనసాగుతుండడం, దరఖాస్తులు భారీగా రావడంతో సిబ్బంది కొరత సమస్యను అధిగమించేందుకు విద్యాశాఖతో పాటు ఇతరశాఖల సిబ్బందికి విధులు కేటాయించారు.