జాతీయం
చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహం
సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇండియా గేట్ వద్ద చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని డిజిటల్గా ప్రధాని మోదీ జనవరి 23న ప్రారంభించారు. ఇక్కడ 28 అడుగుల ఎత్తయిన చంద్రబోస్ గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేవరకు ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఉంచుతారు. ఇది రాత్రివేళల్లో కనిపిస్తుంది.
స్ట్రీట్ స్టూడెంట్
నేషల్ హ్యూమన్ రైట్స్ కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) నిర్వహించిన ఏడో షార్ట్ ఫిల్మ్ పోటీల్లో తెలుగు షార్ట్ ఫిల్మ్ ‘స్ట్రీట్ స్టూడెంట్’కు జనవరి 28న మొదటి బహుమతి లభించింది. దేశం నలుమూలల నుంచి 190 షార్ట్ ఫిల్మ్లు పోటీ పడగా స్ట్రీట్ స్టూడెంట్కు అవార్డు దక్కింది. అవార్డు కింద రూ.2 లక్షల నగదు అందజేస్తారు. వీధి బాలలకు విద్యాహక్కు, అందుకు సమాజం మద్దతు ఇవ్వాల్సిన అవసరంపై ఓ వీధి బాలుడు ఇచ్చిన సందేశమే షార్ట్ ఫిల్మ్. దీనిని ఆకుల సందీప్ రూపొందించారు.
మధ్య ఆసియా దేశాల సదస్సు
భారత్.. కజికిస్థాన్, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ (మధ్య ఆసియా దేశాల) దేశాలతో తొలి ఉమ్మడి సదస్సును వీడియో కాన్ఫరెన్స్ విధానంలో జనవరి 27న నిర్వహించింది. అఫ్గానిస్థాన్లోని పరిణామాలు, మధ్య ఆసియా దేశాలు-భారత్ మధ్య సహకారం, ప్రాంతీయ భద్రత తదితర విషయాలపై చర్చించారు. కజకిస్థాన్ అధ్యక్షుడు కాసెమ్ జోమార్ట్ టొకయేవ్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావక్త్ మిర్జియోయేవ్, తజకిస్థాన్ అధ్యక్షుడు ఇమోమాలి రహమాన్, తుర్క్మెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బంగ్లీ బెర్డిమహమెదోవ్, కిర్గిజ్స్థాన్ అధ్యక్షుడు సడిర్ జపరోవ్ ఈ సదస్సులో పాల్గొన్నారు.
బ్రహ్మోస్
బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులకు తొలిసారిగా ఎగుమతి ఆర్డర్ లభించిందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈవో అతుల్ డీ రాణే జనవరి 28న వెల్లడించారు. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రిత్వ శాఖకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ మధ్య రూ.2,800 కోట్ల (37.4 కోట్ల డాలర్లు) ఒప్పందం కుదిరింది. ఈక్షిపణిని రష్యాతో కలిసి భారత్ అభివృద్ధి చేసింది.
అంతర్జాతీయం
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ భూమికి, సూర్యుడికి మధ్య ఉండే లాంగ్రేజియన్ 2 (ఎల్2) పాయింట్కు చేరిందని నాసా జనవరి 25న తెలిపింది. ఎల్2 పాయింట్ భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. విశ్వం ఆవిర్భావ రహస్యాల పరిశోధనే లక్ష్యంగా ఈ టెలిస్కోప్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ నిర్మించాయి.
కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్
జర్మనీకి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్-2021ని జనవరి 25న విడుదల చేసింది. మొత్తం 180 దేశాలతో ఈ జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో నిలువగా.. నార్వే 4, సింగపూర్ 5, స్వీడన్ 6, స్విట్జర్లాండ్ 7, నెదర్లాండ్స్ 8, లక్సెంబర్గ్ 9, జర్మనీ 10వ స్థానాల్లో నిలిచాయి. భారత్ 85వ స్థానంలో ఉండగా.. బ్రిటన్ 11, అమెరికా 27, పాకిస్థాన్ 140, బంగ్లాదేశ్ 147, దక్షిణ సూడాన్ 180వ స్థానంలో ఉన్నాయి.
టొయోటో వాహనం
చంద్రుడిపై అన్వేషణ కోసం ఒక వాహనాన్ని జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి రూపొందిస్తున్నామని టొయోటో సంస్థ జనవరి 28న వెల్లడించింది. ‘లూనార్ క్రూయిజర్’ అని పేరు పెట్టిన ఈ వాహన లక్ష్యం 2040 నాటికి చంద్రుడిపై, తర్వాత అంగారకుడిపై ప్రజలు నివసించడానికి తోడ్పడటం.
పద్మ అవార్డులు
దేశ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించింది.
పద్మవిభూషణ్: జనరల్ బిపిన్ రావత్ (మరణానంతరం-సివిల్ సర్వీసులు, ఉత్తరాఖండ్), రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం- విద్య, సాహిత్య, ఉత్తరప్రదేశ్), కల్యాణ్ సింగ్ (మరణానంతరం ప్రజా వ్యవహారాలు, ఉత్తరప్రదేశ్), ప్రతి భా ఆత్రే (కళలు, మహారాష్ట్ర).
పద్మభూషణ్: గులాం నబీ ఆజాద్ (ప్రజా వ్యవహారాలు, జమ్ముకశ్మీర్), విక్టర్ బెనర్జీ (కళలు, పశ్చిమబెంగాల్), గుర్మీత్ బవ (మరణానంతం-కళలు, పంజాబ్), బుద్ధదేవ్ భట్టాచార్య (ప్రజా వ్యవహారాలు, పశ్చిమబెంగాల్), నటరాజన్ చంద్రశేఖరన్ (వాణిజ్యం-పరిశ్రమలు, మహారాష్ట్ర), కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులు (వాణిజ్యం-పరిశ్రమలు, తెలంగాణ), మధుర్ జాఫ్రీ (ఇతరాల్లో పాకశాస్త్రం, అమెరికా), దేవేంద్ర ఝఝారియా (క్రీడలు, రాజస్థాన్), రషీద్ఖాన్ (కళలు, ఉత్తరప్రదేశ్), రాజీవ్ మెహ్రిష్ (సివిల్ సర్వీసులు, రాజస్థాన్), సత్య నాదెళ్ల (వాణిజ్యం-పరిశ్రమలు, అమెరికా), సుందర్ పిచాయ్ (వాణిజ్యం-పరిశ్రమలు, అమెరికా), సైరస్ పూనావాలా (వాణిజ్యం-పరిశ్రమలు, మహారాష్ట్ర), సంజయ్ రాజారాం (మరణానంతరం, సైన్స్-ఇంజినీరింగ్, మెక్సికో), ప్రతిభా రే (విద్య-సాహిత్యం, ఒడిశా), స్వామి సచ్చిదానంద్ (విద్య-సాహిత్యం, గుజరాత్), వశిష్ట త్రిపాఠి (విద్య-సాహిత్యం, ఉత్తరప్రదేశ్).
పద్మశ్రీకి 107 మంది ఎంపికయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య (నాగర్కర్నూల్), గిరిజన గాయకుడు రామచంద్రయ్య (కొత్తగూడెం), కూచిపూడి నృత్యకారిణి పద్మజారెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు, ఆర్థోపెడిక్ డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ, భద్రాచలం ఆలయంలో నాదస్వర సంగీతకారుడు గోసవీడు షేక్ హుస్సేన్ (మరణానంతరం) ఉన్నారు.
వార్తల్లో వ్యక్తులు
షింజో అబే
నేతాజీ రిసెర్చ్ బ్యూరో 2022కు గాను నేతాజీ పురస్కారాన్ని జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు జనవరి 23న ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని షింజో తరఫున కోల్కతాలో ఉన్న జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటక అందుకున్నారు.
చేతన్ పటేల్
గుజరాత్కు చెందిన చేతన్ పటేల్కు ‘హీరో టు యానిమల్స్’ అవార్డును పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) జనవరి 26న ప్రకటించింది. చిరు వ్యాపారి అయిన చేతన్ గాలిపటాల్లో వాడే మాంజా వల్ల పక్షుల ప్రాణాలు పోతున్నాయని పలువురిని చైతన్యపర్చారు.
అనంత నాగేశ్వరన్
కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా వీ అనంత నాగేశ్వరన్ జనవరి 28న నియమితులయ్యారు. ఈయన గతంలో పలు బిజినెస్ స్కూళ్లతో పాటు ఇండియా, సింగపూర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో బోధించారు.
ఎండ్లూరి సుధాకర్
ప్రముఖ కవి, రచయిత ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ జనవరి 28న మరణించారు. తెలుగు యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నా అక్షరమే నా ఆయుధం, కథానాయకుడు జాషువా, అటజనికాంచె, కొత్త గబ్బిలం, తొలి వెన్నెల, మల్లెమొగ్గల గొడుగు, వర్గీకరణీయం, నల్లద్రాక్ష పందిరి, వర్తమానం పుస్తకాలను రచించారు.
క్రీడలు
సుభాష్ భౌమిక్
భారత ఫుట్బాల్ దిగ్గజం సుభాష్ భౌమిక్ జనవరి 22న మరణించాడు. 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలుచుకున్న భారత జట్టులో ఉన్నాడు.
పీవీ సింధు
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్-300 టోర్నీని పీవీ సింధు సాధించింది. జనవరి 23న లక్నోలో జరిగిన మ్యాచ్లో సింధు మాళవిక బాన్సోద్ పై గెలిచింది. సింధు ఈ టోర్నీని గెలవడం ఇది రెండోసారి.
పురుషుల డబుల్స్లో మాన్ చాంగ్-వున్ తీ (మలేషియా) జోడీ కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్ (భారత్) జోడీని ఓడించింది.
మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్ పుల్లెల-ట్రీసా జాలి జోడీ చిఒంగ్ చియాంగ్-తియో షింగ్ (మలేషియా) జోడీపై విజయం సాధించింది.
మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్-తనిషా క్రాస్టో జోడీ హేమ నాగేంద్రబాబు-శ్రీవేద్య గురజాడ జోడీపై గెలిచింది.
స్మృతి మంధాన
భారత మహిళ క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ‘ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2021’గా జనవరి 24న నిలిచింది. టామీ బీమాంట్ (ఇంగ్లండ్), లిజెల్లె లీ (సౌతాఫ్రికా), గాబీ లూయిస్ (ఐర్లాండ్) ఈ అవార్డు రేసులో పోటీపడ్డారు. లిజెల్లె బెస్ట్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది.
ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2021గా పాకిస్థాన్ క్రికెటర్ షాహీన్ అఫ్రిది ఎన్నికయ్యాడు.
చరణ్జిత్ సింగ్
భారత హాకీ జట్టు దిగ్గజం చరణ్జిత్ సింగ్ జనవరి 27న మరణించాడు. ఆయన 1964 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.
ఆసియా కప్ హాకీ
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీని జపాన్ గెలుచుకుంది. ఒమన్ రాజధాని మస్కట్లో జనవరి 28న జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్ దక్షిణ కొరియాను ఓడించింది. జపాన్కు స్వర్ణం లభించగా, కొరియాకు రజతం లభించింది. జపాన్ ఈ టోర్నీ గెలవడం ఇది మూడోసారి. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో భారత్ చైనాను ఓడించి కాంస్యం గెలుచుకుంది. ఆసియా కప్లో భారత జట్టు రెండు సార్లు విజేతగా (2004, 2017), రెండు సార్లు రన్నరప్గా (1999, 2009), మూడు సార్లు మూడో స్థానం లో (1993, 2013, 2022) నిలిచింది.
-శ్రీసత్యం చాపల ,ఎడ్యుకేషన్ డెస్క్