న్యూఢిల్లీ: దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2023 తొలిసెషన్ పరీక్షల షెడ్యూల్ మారింది. జేఈఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. సవరించిన తేదీల ప్రకారం బీఈ లేదా బీటెక్ విభాగాల్లో జేఈఈ మెయిన్ తొలి సెషన్ పేపర్-1 జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో (రెండు షిఫ్ట్లు) జరుగుతాయని పేర్కొంది. ఇక జనవరి 28న బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ విభాగాల్లో పేపర్ 2ఏ, 2బీ పరీక్షలను (రెండో షిఫ్ట్లో మాత్రమే) నిర్వహిస్తామని తెలిపింది. కాగా, గతంలో జనవరి 24 నుంచి 31 వరకు పరీక్షలు జరుతాయని తెలిపిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా మొత్తంగా 290 నగరాల్లో దేశం వెలుపలి 25 నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్కార్డులను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. అభ్యర్థులు తదుపరి వివరాల కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్ https://jeemain.nta.nic.in/ తనిఖీ చేస్తుండాలని ఎన్టీఏ సూచించింది.