హైదరాబాద్: ఐఐటీలు, ఎన్ఐటీల్లోని బీఈ లేదా బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్-1లో (JEE Main) రిజిస్ట్రేషన్ గడువు మరో 5 రోజుల్లో ముగియనుంది. అక్టోబర్ 31న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 27న రాత్రి 9 గంటలకు ముగియనున్నాయి. అదేరోజు రాత్రి 11.50 గంటల్లోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో ఏవైన పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోవడానికి.. కరెక్షన్ విండో (Correction Window) డిసెంబర్ 1న తెరచుకోనున్నది. అదే నెల 2న రాత్రి 11.50 గంటలకు కరెక్షన్ అప్లికేషన్ ఫామ్ క్లోజ్ కానుంది. ఇక మొదటి సెషన్ పరీక్షలను 2026 జనవరి 21 నుంచి 30 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే ప్రకటించింది. ఏయే కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించేది జనవరి మొదటి వారంలో ప్రకటిస్తామని తెలిపింది. అదేవిధంగా పరీక్షకు మూడు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 12న ప్రకటించనుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 13 భాషల్లో పరీక్షలను నిర్వహిస్తున్నది.
కాగా, ఈ సారి ఫిజికల్ కాలిక్యులేటర్లను (Calculators) అనుమతించడం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. కొత్తగా ఆన్స్క్రీన్ వర్చువల్ కాలిక్యులేటర్ కంప్యూటర్ తెరపైనే ప్రత్యక్షమవుతుందని తెలిపింది. ప్రాథమిక లెక్కల కోసం దీనిని వాడుకోవచ్చని సూచించింది. వివరాల కోసం విద్యార్థులు https ://jeemain.nta.nic.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. నిరుడు 14 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సారి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరీక్షను తెలుగు సహా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. 2025లోనే కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. నిరుటితో పోల్చితే సిలబస్, పరీక్షావిధానంలో ఎలాంటి మార్పుల్లేవు.
