అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం.. ప్రతిభ ఉన్న పేదలకు ఉచితం చదువంటే కేవలం ఇంజినీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదు. డిగ్రీ, పీజీల్లో అనేక బ్రాంచీలు ఉన్నాయి. విభిన్నమైన కరికులంతో ప్రామాణికమైన విద్యను, కోర్సులను అందించడంలో ప్రేమ్జీ యూనివర్సిటీ పేరుగాంచింది. అంతేకాకుండా చదువుకోవాలనుకునే పేద విద్యార్థుల పాలిట కల్పతరువుగా కూడా ఈ సంస్థ నిలుస్తుంది. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేదనే బాధలేదు. కావల్సిందల్లా ప్రతిభను చూపించడమే. మంచి కోర్సులు. రూ.లక్షల్లో ఫీజు. అయినా అల్పాదాయ వర్గాలకు అంతా ఉచితం. ప్రతి ఏటా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి. ఆదాయాన్ని బట్టి కొందరికి ఉచితంగా, మరి కొందరికి రాయితీలతో కోర్సులను అందిస్తుంది అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ. ఉపాధికి భరోసానిచ్చే కోర్సులు ఇక్కడ ప్రత్యేకం. ప్రస్తుతం ప్రేమ్జీ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు నిపుణ పాఠకుల కోసం….
2011లో లాభాపేక్షలేని విద్యాసంస్థగా యూజీసీ 2ఎఫ్ సెక్షన్ కింద దీన్ని బెంగళూరులో ప్రారంభించారు. దీనికంటే ముందు 2000 సంవత్సరం నుంచి అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ప్రాథమిక విద్యపై దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధి కోసం పనిచేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు వారిలో సామాజిక స్పృహ పెంచడానికి ఈ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది.
ప్రత్యేకతలు: నిష్ణాతులైన అధ్యాపక బృందం, పూర్తిస్థాయిలో ఆధునిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణంలాంటి ప్రత్యేకతలతో బెంగళూరులో ఈ విశ్వవిద్యాలయంలో ఆయా కోర్సులను నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థ స్పష్టంగా పేర్కొన్న సామాజిక ప్రయోజనం. ఒక సంస్థగా న్యాయమైన, సమానమైన, మానవత్వ, స్థిరమైన సమాజాన్ని నిర్మించడానికి విద్య దోహదం చేస్తుందనే ఆలోచనకు ప్రతిరూపం ఈ సంస్థ.
విద్య ద్వారా సమాజంలో మార్పు వస్తుందనే లక్ష్యంతో ఆలోచనలు, స్వయం ప్రతిపత్తిగల వ్యక్తుల సామర్థ్యాన్ని పెంచడం వంటి విస్తృత ప్రయోజనాల కోసం దీన్ని ప్రారంభించారు.
గొప్ప సామర్థ్యం, సమగ్రత, సామాజిక నిబద్ధతతో కూడిన గ్రాడ్యుయేట్లను దేశానికి అందించడం, విద్య, అభివృద్ధి, అనుబంధ రంగాల్లో పరిశోధనల ద్వారా విస్తరించడం, న్యాయవాద, ప్రజా కమ్యూనికేషన్ ద్వారా ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ రంగాల్లో పాలసీలు, ఆచరణాత్మక మార్పుల కోసం కృషి చేయడం కోసం దీన్ని ఏర్పాటుచేశారు.
విభిన్న కరికులం
ఆసక్తి, ఉత్సుకత కలిగించే విధంగా కరికులం, కోర్సులను రూపొందించారు.
అధ్యాపకులు అభ్యాసానికి ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తారు. దీనివల్ల బోధనాపద్ధతులు, అభ్యాస అనుభవాలను రూపొందించడంలో గణనీయమైన స్వయం ప్రతిపత్తి ఉంది.
కోర్సు కంటెంట్ ప్రశ్నించే విధంగా, దాన్ని రిఫ్లెక్ట్ అయ్యేవిధంగా రూపొందించారు. తరగతి గదిలోపల, బయట కూడా కరికులంలోని అంశాలను విద్యార్థులు చర్చించే విధంగా ఉంటాయి. సంభాషణల్లో నిమగ్నం అయ్యేలాంటి అంశాలు కరికులంలో ఉంటాయి.
కాన్సెప్ట్లో నేర్చుకునే అంశాలు క్షేత్రస్థాయిలో ప్రాక్టీస్ ద్వారా మాత్రమే పూర్తిస్థాయిలో అవగతమయ్యే విధంగా, వాస్తవికత ఆధారంగా విషయాలను తెలుసుకునేలా ఉంటాయి.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
బీఏ: ఎకనామిక్స్, హ్యుమానిటీస్- మూడేండ్లు
బీఎస్సీ: ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ- మూడేండ్లు
బీఎస్సీ బీఎడ్ (డ్యూయల్ డిగ్రీ): ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటిక్స్- నాలుగేండ్లు.
ఈ కోర్సులు ఫుల్టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్.
బీఏలో ఎకనామిక్స్/ హ్యుమానిటీస్లను మేజర్స్గా తీసుకోవచ్చు. అదే బీఎస్సీలో అయితే ఫిజిక్స్ లేదా బయాలజీ లేదా మ్యాథ్స్ను మేజర్గా తీసుకోవాలి.
బీఏ/బీఎస్సీలో మొత్తం 84 క్రెడిట్స్. దీనిలో మేజర్స్కు 48 క్రెడిట్స్ కేటాయించారు.
కామన్ కరికులం కింద 36 క్రెడిట్స్ ఉంటాయి. వీటిలో ఫౌండేషనల్స్, అండర్స్టాండింగ్ ఇండియా, ఇంటర్డిసిప్లినరీ స్టడీ, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఈ క్రెడిట్స్కు అదనంగా రిసెర్చ్ వర్క్ (12 క్రెడిట్స్) చేస్తే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
డ్యూయల్ డిగ్రీ (బీఎస్సీ-బీఎడ్ సైన్సెస్/ఎడ్యుకేషన్) ఇది ఫుల్టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్.
120 క్రెడిట్స్ ఉంటాయి.
నోట్: సెమిస్టర్ పొడుగునా అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ దగ్గర ఫీల్డ్ అప్రెంటిస్ ఉంటుంది.
పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సులు
ఎంఏ: ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్స్. ఎల్ఎల్ఎం (లా అండ్ డెవలప్మెంట్).
ఎంఏ కోర్సులు రెండేండ్ల ఫుల్టైం కోర్సులు. ఎల్ఎల్ఎం ఏడాది ఫుల్టైం కోర్సు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 18
ఎంట్రన్స్ టెస్ట్ తేదీ: 2022, జనవరి 2
పూర్తి వివరాల కోసం
వెబ్సైట్: https://azimpremjiuniversity.edu.in
ఎంపిక
యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలను ఉమ్మడి ప్రవేశపరీక్ష ద్వారా కల్పిస్తారు.
బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్ అన్ని కోర్సులకూ ఉమ్మడిగానే పరీక్ష నిర్వహిస్తారు.
ఫీజు-రాయితీలు
పూర్తిగా ఉచితం, పాక్షికంగా తగ్గింపు ఉంటుంది. ఆ వివరాలు..
బీఏ, బీఎస్సీ, బీఎస్సీ-బీఎడ్.. ఏ కోర్సులో చేరినా తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.4 లక్షల్లోపు ఉంటే పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది. వసతి కూడా ఉచితమే.
రూ.4-8 లక్షల లోపు ఉంటే 75 శాతం,
రూ.8-10 లక్షల మధ్య 50 శాతం.
రూ. 10- 15 లక్షల మధ్య ఉన్నవారికి 25 శాతం ఫీజు, వసతిలో రాయితీ లభిస్తుంది.
రూ.15 లక్షలకు మించి వార్షికాదాయం ఉన్నవారు బీఏ, బీఎస్సీ, బీఎస్సీ బీఎడ్ కోర్సులకు పూర్తి ఫీజు చెల్లించాలి. వీరికి రుణ సౌకర్యం ఉంటుంది.
పరీక్ష విధానం
పరీక్షలో రెండు విభాగాలుంటాయి. ఆబ్జెక్టివ్ విభాగంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ రీజనింగ్ ఒక్కో విభాగం నుంచి 18 చొప్పున 36 ప్రశ్నలు వస్తాయి. వీటిని 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి.
ప్రతి కరెక్ట్ సమాధానానికి రెండు మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. సమాధానం తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు.
రెండో విభాగంలో ఎస్సే /డాటా అనాలిసిస్/ ప్రాబ్లమ్ సాల్వింగ్లలో ఒక వ్యాసరూప ప్రశ్న వస్తుంది. అభ్యర్థి ఎంచుకున్న కోర్సుపై ఆధారపడి ఏదో ఒక విభాగం ప్రశ్నకు జవాబు రాయాలి. వ్యవధి ఒక గంట.
అర్హతలు: సంబంధిత గ్రూప్లో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. వయసు 19 ఏండ్లలోపు ఉండాలి.
రాష్ట్రంలో హైదరాబాద్లో పరీక్ష కేంద్రం ఉంది.
ఏటా తరగతులు జూలైలో నిర్వహిస్తారు.