ఊహకు అందితే సైన్స్. అందకపోతే దేవుడు. రెండిట్లోనూ నమ్మకం ఉంది. బలంగా నమ్మితే ఏదైనా జరిగి తీరుతుంది. ఇదే లైన్తో వచ్చిన సినిమా ‘ఆకాశవాణి’. ఆ సినిమాలో రంగడుగా నటించాడు మైమ్ మధు. 27 ఏండ్లుగా మైమ్ కళాకారుడిగా అరుదైన రికార్డులెన్నో కైవసం చేసుకున్న మధు.. ‘ఆకాశవాణి’తో మంచి నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. మైమ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, మార్షల్ ఆర్ట్స్ గురు, యోగా ఆచార్యుడు మధు ప్రస్థానం ఆయన మాటల్లోనే..
‘ఆకాశవాణి’లో నా నటనకు వస్తున్న ఆదరణ చూసి ఆనందిస్తున్నా. ఎందుకంటే నాది 27 ఏండ్ల కళా ప్రస్థానం. ఎప్పుడో తొమ్మిదో తరగతిలో నాకు తెలియకుండానే మూకాభినయం (మైమ్) కళకు ఆకర్షితుడినయ్యాను. ఇప్పటివరకు వేల ప్రదర్శనలిచ్చాను. సినిమా పరంగా ‘ఆకాశవాణి’ తొలి అవకాశం. కానీ దాని తర్వాత నటించిన ‘గాలి సంపత్’ ముందుగా రిలీజ్ అయింది. ప్రేక్షకాదరణ పొందిన ‘చక్రవాకం’, ‘మొగలిరేకులు’ వంటి టీవీ సీరియల్స్లో 1000కిపైగా ఎపిసోడ్స్లో నటించాను. అలా, నటన నా జీవితంలో భాగమైంది.
నా పాత్ర పేరు రంగడు..
‘ఆకాశవాణి’కి నమ్మకమే ఇతివృత్తం. నాగరిక ప్రపంచానికి దూరంగా గూడెంలో జరిగే కథ. అక్కడి ప్రజలకు దేవుడంటే చాలా నమ్మకం, భయం కూడా. పొలిమేర దాటితే దేవుడు శిక్షిస్తాడని అనుకుంటారు. కొన్నాళ్లకు గూడెంలోకి దేవుడంతటి నమ్మకమైన రేడియో వచ్చింది. గూడెంవాసుల జీవితాలు మారిపోయాయి. నరసింహావతారంలోని ప్రహ్లాదుడి ఘట్టాన్ని మూలంగా చేసుకొని కథంతా సాగుతుంది. అందులో నా పాత్రపేరు రంగడు. నిజ జీవితానికి వస్తే.. మాది హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం. నా పూర్తిపేరు అరుసమ్ మధుసూదన్. స్కూల్ వయసులోనే మైమ్ పట్ల ఆకర్షితుడిని అయ్యాను.
అమెరికా ప్రయాణం
చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడటంతో నా ధ్యాస మొత్తం మైమ్పైనే ఉండేది. కానీ, అమ్మానాన్న ఒప్పుకొనేవారు కాదు. నన్ను డాక్టర్గానో, ఇంజినీర్గానో చూడాలనేది వాళ్ల కల. 1991లో ఈ రంగంలోకి వచ్చాను. మైమ్లో మరిన్ని మెలకువలు నేర్చుకునేందుకు మా గురువుగారు నన్ను కోల్కతా పంపించారు. నిరంజన్ గోస్వామి దగ్గర ఇండియన్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. 1999లో అంతర్జాతీయ స్కాలర్షిప్ వచ్చింది. స్కాలర్షిప్ కోసం అమెరికా వెళ్లాలి. డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నానని తెలుసుకొని చిన్న జీయర్ స్వామి లక్ష రూపాయలు ఇచ్చి ఆశీర్వదించి పంపించారు. టోనీ మాన్టెనారో దగ్గర మైమ్లో ఆధునిక టెక్నిక్స్ నేర్చుకున్నాను. దీక్షితులుగారి దగ్గర ఉంటూ మూకాభినయం చేస్తూ .. సినిమాల వైపు దృష్టి సారించాను. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూ ట్లో మైమ్ ఫ్యాకల్టీగా చేశాను. విక్రమ్, సుధీర్ వంటి హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్వరాన్ని అందించాను. నా ప్రయాణంలో మలుపులెన్నో.
కళామ తల్లి..
మూకాభినయం అన్ని కళలకూ తల్లిలాంటిది. ఆంగికం, వాచికం, సాత్వికం, ఆహార్యం అనే చతుర్విధ అభినయాల్లో వాచకం మినహా మిగతా అన్నీ మైమ్లో ఉంటాయి. ప్రతీ కళలో అంతర్లీనంగా మైమ్ ఓ భాగం. హాస్యం, కరుణ, రౌద్రం, శృంగారం, వీరం లాంటి నవరసాల్నీ మూకాభినయంలో పలికిస్తూ, ప్రేక్షకుల్లో కూడా ఆ రసోద్వేగాల్ని కలిగించే అవకాశం మైమ్ కలిగిస్తుంది. ఒగ్గుకథ, యక్షగానం, చిందు భాగవతం కళాకారులు తమకు తెలియకుండానే మూకాభినయం చేస్తారు. మైమ్తో పాటు మార్షల్ ఆర్ట్స్, యోగా నేర్చుకున్నా. మైమ్ గొప్పదనం గురించి చాటిచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను.
‘హైదరాబాదు కేంద్రీయ విశ్వ విద్యాలయంలో రంగస్థల కళల్లో పీజీ చేసి చిన్నచిన్న సామాజిక అంశాలతో ‘పరివర్తన, అప రాజిత, ది ఫిషర్ మ్యాన్, ది డ్రీమ్, జీవితం ఒక తరంగం’ లాంటి ప్రదర్శనలు రూపొందించాను. ఠాగూర్ గీతాంజలిలోని 49 గేయాల్ని మూకాభినయం రూపంలోకి తీసుకొచ్చాను. ఒడిస్సీ, మోహినీ అట్టం జోడించి ప్రత్యేక కళారూపాన్నీ తయారు చేశాను’
దాయి శ్రీశైలం