న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 డెల్టా వేరియంట్పై జైకోవ్-డీ వ్యాక్సిన్ ప్రభావంతంగా పని చేస్తుందని జైడస్ గ్రూప్స్ ఎండీ డాక్టర్ షర్విల్ పటేల్ తెలిపారు. వేరియంట్పై టీకా 66 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జైకోవ్-డీ అత్యవసర వినియోగానికి శుక్రవారం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ధర, సరఫరాపై ఆయన స్పందిస్తూ.. వచ్చే వారం వరకు స్పష్టత వస్తుందన్నారు. సెప్టెంబర్ మధ్యలో టీకాల సరఫరా ప్రారంభమవుతుందని చెప్పారు. అహ్మదాబాద్కు చెందిన ఈ కంపెనీ ఏటా 10-12 కోట్ల మోతాదుల టీకాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కొత్త ఉత్పత్తి ప్లాంట్లో అక్టోబర్ నుంచి నెలకు కోటి వరకు వ్యాక్సిన్ల ఉత్పత్తిని చేయొచ్చని షర్విల్ పటేల్ పేర్కొన్నారు.
టీకా ఫేజ్-3 ట్రయల్స్ దేశవ్యాప్తంగా 28వేల మంది వలంటీర్లపై పరీక్షించారు. ట్రయల్స్ మధ్యంతర ఫలితాల్లో ఆర్టీ పీసీఆర్ పాజిటివ్ కేసుల్లో 66.6 శాతం సామర్థ్యాన్ని చూపింది. జైకోవ్ డీ టీకా ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ (DNA) ఆధారిత వ్యాక్సిన్. మూడు డోసుల టీకా కాగా.. డీఎన్ఏ ఆధారిత ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీతో అభివృద్ధి చేసిన టీకా కొవిడ్ వైరస్ వేరియంట్లను సులభంగా ఎదుర్కోవచ్చని కంపెనీ పేర్కొంది. జైకోవ్ డీ టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వనున్నారు. ప్రస్తుతం 18 ఏళ్లుపై బడిన వారికి మాత్రమే టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు భారత ఔషధ నియంత్రణ కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ, మెడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు అనుమతి ఇవ్వగా.. జైడస్ టీకా ఆరోది కాగా.. రెండో స్వదేశీ వ్యాక్సిన్. కేంద్ర బయోటెక్నాలజీ సంస్థ, జైడస్ క్యాడిలా సంయుక్తంగా జైకోవ్-డీని తయారు చేశాయి.