హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): అన్నిశాఖల్లోని ఉద్యోగులను ఆప్షన్ల ప్రకారం జోన్లవారీగా విభజించి అదే తరహాలో కేటాయించాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన టీఎన్జీవో అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలకు గౌరవప్రదమైన పరిష్కారాన్ని చూపుతున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆకాంక్షల మేరకు ప్రభుత్వ విభాగాలను బలోపేతం చేసేందుకు ఉద్యోగులు పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగుల డీఏ బకాయిలను విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న పీఆర్సీ జీవోలన్నీ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు ఒక శాతం చందాతో ట్రస్టు ద్వారా ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలని, వేతన సవరణ కమిటీలో వ్యత్యాసాలను సవరించేందుకు అనామలీస్ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, కేంద్ర సంఘం సహాధ్యక్షుడు కస్తూరి వెంకట్, సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్కుమార్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శంకర్, హనుమకొండ కార్యదర్శి సోమన్న, భూపాలపల్లి కార్యదర్శి హరికృష్ణ, టీఎన్జీవోకి అనుబంధంగా పనిచేస్తున్న 66 సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.