డప్పు శబ్దం వినిపించగానే చంద్రిక శ్రీనివాస్ మనసు పరవశించేది. తనువు లయబద్ధంగా అడుగులేసేది. వయసుతోపాటు ఆ కళ పట్ల అభిమానమూ పెరిగింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశాక.. ఉద్యోగం గురించి ఆలోచించకుండా, డప్పు కళను బతికించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే థియేటర్ ఆర్ట్స్ చదివింది. 2016లో పట్టుబట్టి పరాయ్ డప్పు వాద్యం నేర్చుకున్నది. ‘అబ్బాయిలకే దిక్కులేదు. అమ్మాయిలు కొట్టడమేంటి?’ అన్న విమర్శలూ వచ్చాయి. తనలానే, డప్పు పట్ల ఆసక్తి ఉన్న ముగ్గురు యువకులను బృందంలో చేర్చుకున్నది చంద్రిక. కోయంబత్తూరులో ‘నిగర్ కలైకూడం’ పేరిట పాఠశాలను ప్రారంభించింది. ఎనిమిదేండ్ల బాలబాలికలకు డప్పు వాయించడంలో శిక్షణ ఇస్తున్నది. ప్రతీ ఆదివారం తరగతులు ఉంటాయి. తోలు డప్పుకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు దానిచుట్టూ ఉన్న కళంకాలను కూడా తొలగించాలన్నది చంద్రిక ప్రయత్నం. ఒకప్పుడు ఆడపిల్లలు డప్పును ముట్టుకున్నా దోషమే. అదే నేడు, చంద్రిక పాఠశాలలో శిక్షణ తీసుకుంటున్న 400 మందిలో సగానికిసగం అమ్మాయిలే. దాన్నొక సర్టిఫికెట్ కోర్సుగా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నది చంద్రిక. గిటార్, పియానోలతో సరి సమాన హోదా కల్పించాలన్నది ఆమె సంకల్పం.
ఒకప్పుడు పెండ్లయినా పేరంటమైనా డప్పు మోగేది. అంత్య క్రియలైనా అమ్మవారి ఊరేగింపైనా డప్పు చప్పుడు ఉండాల్సిందే. ప్రకటన అయినా పంచాయతీ అయినా చాటింపు వేయాల్సిందే. కానీ ఇప్పుడు? ఫంక్షన్ల నుంచి పల్లకీ సేవల వరకు అన్నిటికీ డీజేలూ బారాత్లే. ఈ సంక్షోభ సమయంలో డప్పు కళను బతికిస్తున్నది తమిళనాడుకు చెందిన చంద్రిక శ్రీనివాస్.