లక్నో : ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో జికా వైరస్ సోకిన ఓ గర్భిణి ఇద్దరు కవల పిల్లలకు జన్మనించింది. వైరస్ సోకిన గర్భిణి ప్రసవించిన తొలి కేసు ఇదే కాగా.. ఇద్దరు కవలల్లో ఓ నవజాత శిశువు పరిస్థితి విషమంగా ఉన్నది. గుండెకొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాజిఖేడాలో నివాసం ఉంటున్న భరత్ మహతో భార్య ప్రతిమకు ఈ నెల 8న జికా పాజిటివ్గా తేలింది. అప్పటికే గర్భం దాల్చి తొమ్మిది నెలలు కావస్తుండడంతో స్థానికంగా ఉన్న మహిళా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో చేర్పించారు.
ఈ నెల 12న ప్రతిమకు ఆపరేషన్ చేయగా.. ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మంగళవారం ఆసుప్రతి నుంచి ప్రతిమను ఇంటికి పంపారు. వైద్యారోగ్యశాఖ బృందం శిశువు మూత్రం నమూనాలను సేకరించింది. అయితే జికా పాజిటివ్గా తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేవని ప్రతిమ తెలిపిన ఆమె.. తన బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నది. మొదట పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఐసీయూలో ఉన్న నవజాత శిశువు పరిస్థితిని జీఎస్వీఎం మెడికల్ కాలేజీలోని పిల్లల వైద్య నిపుణులు పరీక్షించారు. పిల్లలకు మైక్రోసెఫాలీ లేదా జికాకు సంబంధించిన సమస్యలు లేవని తెలిపారు. పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత తన భార్యకు తొలి కాన్పని భరత్ మహతో తెలిపారు. వైద్య ఖర్చులకు ఇబ్బంది ఎదురవుతోందన్నారు. ఇదిలా ఉండగా.. కాన్పూర్లో తొమ్మిది మంది గర్భిణులకు జికా సోకినట్లు గుర్తించారు. ఇందులో ఇద్దరికి నెగెటివ్ వచ్చింది. ఓ మహిళ ప్రసవించింది. ఆరోగ్యశాఖ బృందాలు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.