Zaheerabad |కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట మునిగినట్టే అని చెప్పడానికి సరైన ఉదాహరణ జహీరాబాద్ నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏండ్ల తరబడి గుడ్డిగా నమ్మారు. కాంగ్రెస్కు ఓటేస్తే తమ బతుకులు బాగుపడతాయని భ్రమపడ్డారు. వాళ్ల ఓట్లతో గెలిచిన నాయకులు బాగుపడ్డారు కానీ, ప్రజలు మాత్రం దగా పడి గోసపడ్డారు. ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు కానీ, ప్రజలకు మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కాంగ్రెస్ను నమ్మినందుకు జహీరాబాద్ అన్నింటా వెనుకబడ్డది.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంకనే జహీరాబాద్ ప్రగతి జోరుగా కొనసాగుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాకే చెందిన సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రాంత కష్టాలను, గత పాలకుల వల్ల ఈ నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని స్వయంగా
చూశారు. దీంతో అధికారంలోకి రాగానే అభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తిపోతలను నిర్మిస్తున్నది. నిమ్జ్ ఏర్పాటు అవుతున్నది. మరెన్నో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
నియోజకవర్గానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 12 సార్లు గెలిచింది. 2009, 2014లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి గీతారెడ్డి గెలిచారు. కాంగ్రెస్ హయాంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. కాని అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాకే చెందిన సీఎం కేసీఆర్ జహీరాబాద్ ప్రాంత కష్టాలను, గత పాలకుల వల్ల ఈ నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని స్వయంగా చూశారు. అధికారంలోకి రాగానే అభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. ఇవి చూసిన ప్రజలు గత ఎన్నికల్లో 34 వేల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావును గెలిపించారు. ఆయన ఎమ్మెల్యే అయ్యాక గత ఐ దేండ్ల నుంచి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన గీతారెడ్డి ఇక్కడికి పరిశ్రమలు తీసుకురావడంలో విఫలమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడికి పెద్దఎత్తున పరిశ్రమలను తీసుకువస్తున్నది. 12,635 ఎకరాల్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) ఏర్పాటు అవుతున్నది. రూ.1000 కోట్లతో వెమ్ టెక్నాలజీ అనే డిఫెన్స్ పరిశ్రమను ప్రభుత్వం ఇక్కడికి తీసుకువచ్చింది. రూ.1000 కోట్లతో మహీంద్రా పరిశ్రమ విస్తరణ జరుగుతున్నది. ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దుతున్నది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలను తీసుకువస్తున్నది. ట్రైటాన్ కంపెనీ రూ.2100 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నది. రూ.1500 కోట్ల పెట్టుబడితో ఆటోమొబైల్ పరిశ్రమ ఏర్పాటవుతున్నది. కోహీర్ మండలం వెంకటాపూర్లో 1,009 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.
దశాబ్దాల నుంచి ఈ ప్రాంతం కరువుతో అల్లాడిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం జహీరాబాద్ను సస్యశ్యామలం చేసేందుకు అడుగులు వేస్తున్నది. రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతలను నిర్మిస్తున్నది. దీంతో 1,03,259 ఎకరాలకు సాగునీరు అందనున్నది. మిషన్ కాకతీయ ద్వారా రూ.31.04 కోట్లతో 278 చెరువులను పునరుద్ధరించడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఇక సాగు,తాగునీటికి ఢోకాలేదు.
☞ రూ.50 కోట్లతో జహీరాబాద్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు.
☞ గ్రామానికి రూ.20 లక్షల చొప్పున138 గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
☞ జహీరాబాద్ రెవెన్యూ డివిజన్గా ఏర్పడింది. పోలీసు సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు.
☞ రూ.69 కోట్లతో 1,060 డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేశారు.
☞ నిజాంపేట -బీదర్ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.540 కోట్లు మంజూరు.
☞ జహీరాబాద్లో 100 పడకల దవాఖాన, మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం.
☞ మిర్జాపూర్, కోహీర్లో కొత్తగా 50 పడకల దవాఖానల నిర్మాణం.
☞ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు.