న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇవాళ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయవాది శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రక్షణ శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ గురించి దాఖలైన పిల్పై విచారణ జరిగింది. ఆ పిల్ను అడ్వకేట్ శర్మ దాఖలు చేశారు. దాని గురించి వాదనలు జరగుతున్న సమయంలో జస్టిస్ డీవై చంద్రచూడ ఓ జోకేశారు. చాలా సరదగా ఆయన ఓ కామెంట్ చేశారు. నువ్వు వీరుడివే కావొచ్చు, కానీ అగ్నివీరుడివి కాదు అని న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. దీంతో కోర్టు హాల్లో నవ్వులు పూశాయి.
సుప్రీంలో పిల్లు దాఖలు చేయడంలో న్యాయవాది శర్మ పాపులర్. ఆయన ఎప్పుడూ ఏదో ఒక పిల్ వేస్తూనే ఉంటారు. అయితే జస్టిస్ చంద్రచూడ్ కామెంట్ తర్వాత అడ్వకేట్ శర్మ ఇదే విషయాన్ని గుర్తు చేశారు. తన కష్టాన్ని జస్టిస్ చంద్రచూడ్ గుర్తించి ఆ కామెంట్ చేశారని శర్మ అన్నారు. అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ తొలి పిల్ దాఖలు చేసింది తానే అని, అందుకే జస్టిస్ చంద్రచూడ్ తనను అలా అని ఉంటారని శర్మ అన్నారు. అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.