సింగపూర్: భారత స్టార్ లిఫ్టర్, ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించింది. సింగపూర్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం చేజిక్కించుకోవడం ద్వారా మీరాబాయికి ఈ అవకాశం దక్కింది. తొలిసారి 55 కేజీల విభాగంలో బరిలోకి దిగిన చాను.. శుక్రవారం జరిగిన పోటీలో 191 కేజీలు (86+105) ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. జెస్సిక (167 కేజీలు; ఆస్ట్రేలియా), ఎల్లీ కాసెండ్రా (165 కేజీలు; మలేషియా) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన జెస్సిక కంటే మీరాబాయి 24 కేజీలు ఎక్కువ బరువు ఎత్తడం విశేషం. ఇదే టోర్నీ బరిలోకి దిగిన భారత లిఫ్టర్లు సంకేత్ సాగర్ (55 కేజీలు), రిషికంఠ (55 కేజీలు), బింద్యారాణి (59 కేజీలు) కూడా కామన్వెల్త్ గేమ్స్కు బెర్త్ దక్కించుకున్నారు.