యాదాద్రి భువనగిరి, నవంబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాఠశాల విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలు, ప్రతిభను పరిరక్షించేందుకు శుక్రవారం నిర్వహిస్తున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 155 పాఠశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షకు 1,677 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సర్వే నిర్వహించగా..ఈసారి ప్రైవేట్ పాఠశాలలతోపాటు కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహిస్తున్నారు. శాంపిల్గా నాలుగు తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 3వ తరగతి నుంచి 44 పాఠశాలలు, 5వ తరగతి నుంచి 38 పాఠశాలలు, 8వ తరగతి నుంచి 48 పాఠశాలలు, 10వ తరగతి నుంచి 60 పాఠశాలలు పాల్గొంటున్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ కో ఆర్డినేటర్గా భువనగిరిలోని జీనియస్ పాఠశాల ప్రిన్సిపాల్ బి.స్వర్ణలత వ్యవహరిస్తుండగా..పరీక్షల నిర్వహణ కోసం 154 మంది అబ్జర్వర్లను, 234 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియమించారు. వీరికి గురువారం జీనియస్ పాఠశాలలో డీఈఓ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ నిర్వహించారు. యేటా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్సీఈఆర్టీ) ఈ సర్వేను చేపడుతున్నది. 2014లో ఒకసారి ఈ సర్వే నిర్వహించగా.. ఏడేండ్ల తర్వాత ఈ ఏడాది సర్వేను నిర్వహిస్తున్నారు. పరీక్ష సందర్భంగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సెలవు పెట్టకూడదని, విద్యార్థులు గరిష్ఠ సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని డీఈఓ కానుగుల నర్సింహ ఒక ప్రకటనలో కోరారు.