యాదాద్రి, నవంబర్ 9 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో కార్తిక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. ఉదయం 4 గంటల నుంచి నిత్యపూజలు ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా కొనసాగాయి. ఈ సందర్భంగా తిరుకల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మొదటగా శ్రీ సుదర్శన నారసింహహోమం, మహామండపంలో అష్టోత్తరం జరిపించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి, అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. కార్తీకమాసం సందర్భంగా కొండ కింద పాతగోశాల వద్ద వ్రత మండపం, పాతగుట్ట వ్రత మండపంలో భక్తులు సత్యనారాయణ వ్రతమాచరించారు. తెల్లవారుజామున మహిళలు దీపారాధనలు చేపట్టి మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో లక్ష్మీనరసింహస్వామి నిత్యపూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కన గల విష్ణుపుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్రపాలకుడిని కొలుస్తూ అర్చకులు వేదమంత్ర పఠనాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సింధూర అలంకరణ, తమలపాకులతో అర్చన చేశారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. లలితాపారాయణం చేసి, ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు.
స్వామివారిని దర్శించుకున్న ఉపలోకాయుక్త
లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఉపలోకాయుక్త వి. నిరంజన్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారి వేద ఆశీర్వచనం చేసి, ప్రసాదం అందజేశారు. అనంతరం కొండపైన గల హరితహోటల్లో బస చేశారు. బుధవారం ఉదయం బాలాలయంలో అభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
21 రోజుల హుండీ ఆదాయం రూ. 89,95,568
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి 21 రోజుల హుండీల ఆదాయం రూ. 89 లక్షలు దాటిందని యాదాద్రి ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండపై గల హరిత హోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.89,95,568 వచ్చిందని చెప్పారు. మిశ్రమ బంగారం 188 గ్రాములు, మిశ్రమ వెండి మూడు కిలోలు వచ్చిందని తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,00,998
రూ.100 దర్శనం 24,100
సుప్రభాతం 1,900
వేద ఆశీర్వచనం 4,644
క్యారీబ్యాగుల విక్రయం 4,950
టెంకాయల విక్రయం 33,000
వ్రత పూజలు 75,,000
కల్యాణకట్ట టిక్కెట్లు 14,600
ప్రసాద విక్రయం 3,62,700
శాశ్వత పూజలు 26,232
వాహన పూజలు 7,500
టోల్గేట్ 1,380
అన్నదాన విరాళం 29,833
సువర్ణ పుష్పార్చన 75,740
యాదరుషి నిలయం 56,390
పాతగుట్ట నుంచి 15,690
గోపూజ 600
ఇతర విభాగాలు 5,90,400
శ్రీవారి ఖజానాకు మంగళవారం రూ. 14,24,457 ఆదాయం వచ్చింది.