Large shivling : ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యంత బరువైన శివలింగం (Shivaling) ప్రయాణం మధ్యలోనే నిలిచిపోయింది. తమిళనాడు (Tamil Nadu) లోని మహాబలిపురం (Mahabalipuram) లో తయారైన శివలింగం అదివారం ఉదయం బీహార్లోని గోపాల్గంజ్కు చేరుకుంది. గోపాల్గంజ్లో గండక్ నది (నారాయణి నది) పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరడంతో ఆ భారీ శివలింగాన్ని తరలించడం అక్కడి అధికారులకు పెద్ద సవాల్గా మారింది.
ఈ భారీ శివలింగం బరువు సుమారు 210 టన్నులు కాగా.. దీనిని తరలిస్తున్న 106 చక్రాల ప్రత్యేక ట్రైలర్ (లారీ) బరువు మరో 160 టన్నులు. ఈ రెండింటి మొత్తం బరువును ఆ వంతెన మోయలేదని నిపుణులు చెబుతున్నారు. వంతెనపై చాలాచోట్ల పగుళ్లు ఉన్నట్లు ప్రాథమిక తనిఖీల్లో గుర్తించడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, బీహార్ రాజ్యపుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ బృందాలను పిలిపించినట్లు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ సిన్హా తెలిపారు. బీహార్ మంత్రి అశోక్ చౌదరి కూడా గోపాల్గంజ్కు వచ్చి వంతెనను స్వయంగా పరిశీలించనున్నారు. వారి పరిశీలన అనంతరం శివలింగం తరలింపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా ఈ మహా శివలింగాన్ని తూర్పు చంపారన్ జిల్లా కేంద్రమైన మోతిహారిలోని విరాట్ రామాయణ్ ఆలయానికి తరలించాల్సి ఉంది. ఈ భారీ వాహనం మహాబలిపురం నుంచి 3,178 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 32 రోజుల్లో ఈ వాహనం గోపాల్గంజ్కు చేరుకుంది. శివలింగం తూర్పు చంపారన్ చేరుకోవడానికి మరో రెండు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, వాటి పరిస్థితి సంతృప్తికరంగా లేదని అధికారులు చెబుతున్నారు.
ఒక మార్గంలోని వంతెన సామర్థ్యం సరిపోదని, మరో మార్గంలో కూడా అనేక చిన్న వంతెనలు, కల్వర్టులు ఉండటంతో భారీ వాహనం ప్రయాణించడం కష్టమని భావిస్తున్నారు. దాంతో శివలింగాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు అధికారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.