ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్కు చుక్కెదురైంది. వెస్టిండీస్పై ఘన విజయంతో జోరు మీద కనిపించిన మిథాలీరాజ్ నేతృత్వంలోని టీమ్ఇండియా.. ఇంగ్లండ్ ముందు కుదేలైంది. బ్యాటర్లు ఘోరంగా విఫలమైన పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
మౌంట్ మౌంగనుయి: ప్రపంచకప్లో భారత్కు మరో ఓటమి. బుధవారం జరిగిన ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చార్లీ డీన్(4/23), శ్రుభ్సోల్(2/20) ధాటికి టీమ్ఇండియా 36.2 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ స్మృతి మందన(35), రిచా ఘోష్(33)మినహా బ్యాటింగ్లో అందరూ విఫలమయ్యారు. యస్తికా భాటియా(8)తో మొదలైన టీమ్ఇండియా వికెట్ల పతనం ఆఖరి వరకు కొనసాగింది. అయితే ఫామ్మీదున్న మందన, హర్మన్ప్రీత్కౌర్(14) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వీరిద్దరు నాలుగో వికెట్కు 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో రిచా ఘోష్, జులన్ గోస్వామి(20) బ్యాటు ఝులిపించడంతో భారత్కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.
ఇంగ్లండ్ పడుతూ లేస్తూ:
స్వల్ప లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ బ్యాటింగ్ పడుతూ లేస్తూ సాగింది. నాలుగు పరుగులకే ఓపెనర్లు టామీ బ్యూమౌంట్(1), వ్యాట్(1) పెవిలియన్ చేరారు. అయితే కెప్టెన్ హిథర్నైట్(53 నాటౌట్), నాట్ స్కీవర్(45) క్రీజులో కుదురుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 31.2 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. మేఘనసింగ్(3/26) మూడు వికెట్లతో ఆకట్టుకుంది. డీన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
వన్డేల్లో 250 వికెట్లు తీసిన తొలి బౌలర్గా టీమ్ఇండియా పేసర్ జులన్ గోస్వామి నిలిచింది. ఫిట్జ్ ప్యాట్రిక్ (180), అనిసా (180) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు: భారత్: 36.2 ఓవర్లలో 134 ఆలౌట్(మందన 35, రిచాఘోష్ 33, డీన్ 4/23), ఇంగ్లండ్: 31.2 ఓవర్లలో 136/6(నైట్ 53 నాటౌట్, స్కీవర్ 45, మేఘనసింగ్ 3/26)