భోపాల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు అరుదైన గౌరవం ఇచ్చింది. ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు అర్హత గల మహిళలను సెక్యూరిటీగా నియమించింది. సీఎం ప్రయాణించే కారు డ్రైవర్ కూడా మహిళే కావడం విశేషం. సీఎంకు రక్షణగా ఉన్న మహిళలందరూ ఒకే యూనిఫాం ధరించి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో సీఎం శివరాజ్సింగ్.. ఇవాళ ఉదయం పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కూడా చీపురు పట్టి ఊడ్చి.. కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.