రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం రంగంపల్లిలో ఘటన
షాద్నగర్, అక్టోబర్ 25: తనను హత్యచేస్తాడేమోననే భయంతో.. భార్యే కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం రంగంపల్లి గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. సీఐ నవీన్కుమార్, స్థానికుల కథనం ప్రకారం.. రంగంపల్లి గ్రామానికి చెందిన దుర్గం నర్సింలు(40), అనంతమ్మ దంపతులు. నర్సింలు కూలీగా పనిచేస్తున్నాడు. కుటుంబ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆదివారం భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో నర్సింలు.. చంపుతానని భార్యను బెదిరించాడు. తనను ఎప్పుడైనా హత్యచేస్తాడని భావించిన ఆమె.. భర్తనే హత్యచేయాలని నిర్ణయించుకున్నది. ఆదివారం రాత్రి భర్త నిద్రపోయాక ఇంటి ఆవరణలో ఉన్న బండరాయితో నర్సింలు తలపై మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సింలుకు గతంలో నేరచరిత్ర ఉన్నదని స్థానికులు తెలిపారు. షాద్నగర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.