డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని పౌరి గర్హాల్ ప్రైవేట్ రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోయిన యువతి(19) విగత జీవిగా పడిఉండటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి రిసార్ట్ యజమాని, మేనేజర్ సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరికి బీజేపీ నేతలతో సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపించడంతో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది.
సెప్టెంబర్ 18 నుంచి తమ కూతురు కనిపించకుండా పోవడంతో యువతి తల్లితండ్రుల ఫిర్యాదు ఆధారంగా 21న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతి అదృశ్యమైనప్పటి నుంచి రిసార్ట్ యజమాని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. మూడు రోజుల అనంతరం రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్య, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా, మేనేజర్ సౌరవ్ భాస్కర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
యువతి మృతదేహం గురువారం సెప్టెంబర్ 22న లభ్యమైందని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ప్రతినిధి గరిమ దాసోని చెప్పారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన వినోద్ ఆర్యకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ కేసులో కేవలం 24 గంటల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. కేసులో తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.