మణికొండ : ప్రమాదవశాత్తు గండిపేట చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన బుడాల భారతమ్మ(53) భర్త క్రిష్ణ, కొడుకులతో కలిసి ఉంటుంది. కాగా బుధవారం రాత్రి పదిగంటల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన భారతమ్మ తెల్లవారే సరికి చెరువులో మృతదేహంగా కన్పించింది.
విషయం తెలుసుకున్న స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు విచారణ చేపట్టారు. భారతమ్మ బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో గొడవపడి చెరువులోకి వెళ్లినట్లు స్థానికులు కొందరు ఆరోపిస్తుండగా…చేపల కోసం వేసిన వలలను తీసేందుకు చెరువులోకి వెళ్లిన సమయంలో మూర్చవ్యాధి ఉండటంతో నీటిలో పడి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.
కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని ప్రమాదశాత్తు మూర్చ రావడంతోనే ఆమె చనిపోయి ఉండవచ్చని కుటుంబసభ్యులు అంటున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాములు తెలిపారు.