ముంబై, ఫిబ్రవరి 28: హైదరాబాద్కు చెందిన ఇంట్రా-సిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సంస్థ విజర్డ్ను మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ చేజిక్కించుకుంటున్నది. ఈ డిజిటల్ కామర్స్, లాస్ట్-మైల్ డెలివరీ సర్వీసెస్ కంపెనీలో 60 శాతం వరకు వాటాను కొనుగోలు చేస్తున్నట్టు సోమవారం మహీంద్రా లాజిస్టిక్స్ తెలిపింది. డీల్ విలువ రూ.71.73 కోట్లు. ఇందులోభాగంగా రూపాయి ముఖ విలువ కలిగిన 43,972 ఈక్విటీ షేర్లను రూ.6,692.02 చొప్పున, రూ.100 ముఖ విలువ కలిగిన 63,200 సిరీస్ ఏ సీసీసీపీఎస్ షేర్లను రూ.6,593.02 చొప్పున మహీంద్రా లాజిస్టిక్స్ కొంటున్నది. కాగా, ఈ కొనుగోలు.. తమ డెలివరీ వ్యాపారానికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన ఆధారిత డెలివరీ సర్వీస్ ఈడీఈఎల్కు కలిసిరాగలదని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో మహీంద్రా ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఏటా 6 కోట్ల ప్యాకేజీలను డెలివరీ చేస్తున్న విజర్డ్.. గత మూడేండ్లలో 10రెట్లు వృద్ధి చెందింది. ఈ క్రమంలో తమ ఆధ్వర్యంలో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్న విశ్వాసాన్ని మహీంద్రా లాజిస్టిక్స్ వెలిబుచ్చింది.