న్యూఢిల్లీ: ఆధిక్యం చేతులు మారుతూ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటకను చిత్తు చేసిన తమిళనాడు ట్రోఫీ కైవసం చేసుకుంది. సోమవారం ఇక్కడి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు 4 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. స్టార్ ఆటగాళ్లు మనీశ్ పాండే (13), కరుణ్ నాయర్ (18) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. అభినవ్ మనోహర్ (46), ప్రవీణ్ దూబే (33) రాణించారు. తమిళనాడు బౌలర్లలో సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో తమిళనాడు సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. జగదీశన్ (41) రాణించగా.. ఆఖర్లో షారుక్ ఖాన్ (15 బంతుల్లో 33 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. షారుక్ ఖాన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.