Nitish Kumar : బిహార్ రాజకీయాల్లో ఇంకా నితీష్ కుమార్ హవానే కొనసాగే అవకాశం ఉంది. మరో ఆరు నెలలు నితీషే సీఎంగా ఉంటారని ఆయన ప్రధాన అనుచరుడు, మంత్రి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత బిహార్ సీఎంగా నితీష్ తనయుడు నిశాంత్ పదవి చేపట్టడాన్ని కొట్టిపారేయలేమన్నారు. ప్రస్తుతం బిహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. మరో వారంలోపే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేస్తారు. ఇప్పటికే ఆయన తన లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో బిహార్ అసెంబ్లీని వీడాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, నిబంధనల ప్రకారం అసెంబ్లీలో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పదవి లేకపోయినా గరిష్టంగా ఆరు నెలలపాటు సీఎం పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన 6 నెలలపాటు రాజ్యసభకు వెళ్లకుండా బిహార్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలలపాటు బిహార్ సీఎంగా కొనసాగుతారని జేడీయూ నేత, రాష్ట్ర మంత్రి, నితీష్ అనుచురుడు శ్రావణ్ కుమార్ వెల్లడించారు. తాను ఎంతకాలం సీఎం పదవిలో ఉండాలి, ఎప్పుడు రాజీనామా చేయాలి అనే విషయంలో నితీషే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని శ్రావణ్ అన్నారు. తన రాజకీయ నిర్ణయాల్ని ఆయనే సొంతంగా తీసుకుంటారని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి రాజ్యసభ ఎంపీగా నితీష్ ఎప్పుడు ప్రమాణం చేస్తారనే విషయంలో తనకు సమాచారం లేదన్నాడు. ఒకవేళ తనకు సీఎంగా ఉండాలని అనిపిస్తే, రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసినప్పటికీ, బిహార్ సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు.
రాజ్యాంగం ప్రకారం ఆరు నెలలపాటు ఈ వెసలుబాటు ఉన్న విషయాన్ని శ్రావణ్ గుర్తు చేశారు. అలాగే, నితీష్ తర్వాత ఆయన తనయుడు నిశాంత్ కుమార్ సీఎం కావాలంటూ కొందరు డిమాండ్ చేస్తుండటంపై కూడా ఆయన స్పందించారు. ఈ డిమాండ్లో తప్పేమీ లేదన్నాడు. నిశాంత్ యువకుడని, సమర్ధుడు, విద్యావేత్త అని, అయితే నిశాంత్ విషయంలో తుది నిర్ణయం నితీష్ కుమార్తోపాటు పార్టీ వర్గాలు తీసుకుంటాయని తెలిపాడు. ప్రస్తుతం నితీష్ సీఎంగా కొనసాగుతారా.. లేక పదవికి రాజీనామా చేస్తారా అనే అంశంపై బిహార్ రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.