హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా దాదాపు రెండేండ్లుగా ఇంటి నుంచే పనిచేస్తున్న (వర్క్ ఫ్రమ్ హోమ్) ఉద్యోగులను అనేక కంపెనీలు ఇప్పుడిప్పుడే ఆఫీసులకు పిలుస్తున్నాయి. అయితే, సహోద్యోగులందరూ కరోనా టీకాలు వేసుకొని, కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే తాము ఆఫీసుకు వస్తామని చాలామంది కంపెనీలకు చెప్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా 78% మంది ఉద్యోగులు ఇలాగే అభిప్రాయపడుతున్నట్టు వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సర్వేలో తేలింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు మారుతున్న పరిస్థితులపై డబ్ల్యూఈఎఫ్, మార్కెట్ రిసెర్చ్ ఏజెన్సీ ఇప్సోస్ సంయుక్తంగా 33 దేశాల్లో 14వేల మంది ఉద్యోగులపై సర్వే చేశాయి. ఇందులో భాగంగా భారత్లో 500 మంది ఉద్యోగులను ప్రశ్నించారు. వారిలో 90 శాతం మంది టీకా తప్పనిసరి అన్నారు.
అంతటా ఒమిక్రాన్ కలవరం
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తున్నది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నెదర్లాండ్స్ శనివారం దేశవ్యాప్తంగా క్రిస్మస్ లాక్డౌన్ విధించింది. వచ్చే ఏడాది జనవరి 14 వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నది. జర్మనీ సైతం ఆంక్షలబాట పట్టింది. బ్రిటన్ నుంచి జర్మనీకి వచ్చేవాళ్లు తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలిచ్చింది. బ్రిటన్లో గడిచిన 24 గంటల్లో 10,059 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం 3,201 కేసులు నమోదుకాగా.. తాజాగా ఒక్కరోజులోనే మూడురెట్లు పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. ఒమిక్రాన్ ప్రభావంతో అమెరికాలో వైద్యరంగంపై ఒత్తిడి పెరుగుతున్నది. భారత్లో తాజాగా మరో ఎనిమిది ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 151కు పెరిగింది. అండమాన్ నికోబార్ దీవుల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తైనట్టు అధికారులు తెలిపారు.