ఏటా దీపావళికి ఈపీఎఫ్ ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీని పండుగ కానుకగా ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఖాతాల్లో ఈ వడ్డీ జమ కావడానికి మాత్రం ఆలస్యం అవుతుంది. ఈ ఏడాది కూడా నిరుడున్న 8.5 శాతం వడ్డీనే కేంద్రం కొనసాగించింది. నిజానికి రెండు వారాల్లోపు ఈ వడ్డీ జమ కావాల్సి ఉంటుంది. కానీ ఆలస్యం తప్పట్లేదు.
దీనికి ప్రధాన కారణం చాలావరకు పేరుకుపోయిన పేపర్ వర్క్. సెంట్రల్ బోర్డు ట్రస్టీలు ఏటా మార్చిలో సమావేశమై రాబోయే ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటును ప్రకటిస్తారు. దీన్ని ఆర్థిక శాఖ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కార్మిక శాఖ సదరు వడ్డీరేటును నోటిఫై చేయాలి. ఈ ప్రక్రియ తర్వాతనే వడ్డీ.. పీఎఫ్ ఖాతాలోకి చేరుతుంది. కానీ ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి ఇంటర్ మినిస్టీరియల్ సమన్వయం లేక ఏటా ఆలస్యమే అవుతున్నది. దీనికితోడు వడ్డీ చెల్లింపు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు ఖాతాల్లోకి వెళతాయి. అందుకు అనుగుణంగా నిధులను సమీకరించే వరకు ఆర్థిక శాఖ సైతం ఆలస్యం చేస్తున్నది. అలాగే మిగతా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కూడా వడ్డీ చెల్లింపులు ఈ సమయంలోనే జరుగుతాయి. కనుక సహజంగానే నిధుల లభ్యత వడ్డీ జమపై ప్రభావం చూపుతున్నది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వడ్డీని నిర్ణయించి ఆ త్రైమాసికం చివరలో ఖాతాల్లో జమ చేయాలి.