ఆంజనేయుడికి చందనం (సిందూరం)తో పూజిస్తే మంచిదంటారు! కారణం తెలియజేయగలరు?
– రమ్య, నల్లగొండ
Hanuman | సిందూరం ఆంజనేయుడికి ప్రీతిపాత్రం కావడం వెనుక రామాయణ గాథలో ఒక ఘట్టాన్ని కారణంగా చెబుతారు. రామరావణ సంగ్రామం జరిగే సమయంలో ఒక సందర్భంలో శ్రీరాముడు… ఆంజనేయుడి భుజాలపై ఎక్కి యుద్ధం చేశాడు. ఆ సమయంలో రావణుడు విసిరిన బాణాలు తరచుగా ఆంజనేయుడికీ తగిలాయి. హనుమ శరీరమంతా రక్తసిక్తమైంది. అయినా ఏమాత్రమూ చలించకుండా దృఢదీక్షతో నిలబడతాడు రాంబంటు. రక్తంతో తడిసి ముద్దయిన హనుమ దేహం ‘పూచిన మోదుగచెట్టువలె ఉంద’ని వాల్మీకి మహర్షి వర్ణించారు. ఆనాటి సన్నివేశం హనుమకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తినీ కలిగించింది.
ఆంజనేయుడికి స్వామికార్యం తప్ప స్వకార్యం లేదు కదా! అందుకే ఈనాటికీ తిరుమల బ్రహ్మోత్సవాలు సహా అన్ని వైష్ణవ ఆలయాల ఉత్సవాల్లో విష్ణుమూర్తికి ‘హనుమత్ వాహనం’ ఏర్పాటు చేసే సంప్రదాయం కనిపిస్తుంది. ఇక అర్చనలో భాగంగా ఆంజనేయుడికి ఎర్రని సిందూరం అలదినప్పుడు ఆనాడు రామయ్య కోసం శరీరం రక్తసిక్తమైన వేళ తను పొందిన ఆనందం తలపులో మెదిలి హనుమ ఆనందిస్తాడట! వెంటనే భక్తుల పట్ల ప్రసన్నుడు అవుతాడని పెద్దల మాట. ఈ అభిప్రాయంతో ఆంజనేయుడికి సిందూరం పూసే ఆచారం లోకంలో ప్రచారమైంది. అంతేకాదు, ఎర్రని రంగు పరాక్రమానికీ, పవిత్రతకూ, త్యాగానికీ సంకేతం. ఈ గుణాల సమ్మేళనమే హనుమంతుడు. కాబట్టి హనుమత్ అర్చనలో సిందూర పూజ ప్రత్యేకమైనదిగా నిలిచింది.
– శ్రీ