నీటిపై తేలియాడే నగరాన్ని ఏ దేశంలో నిర్మించనున్నారు? (డి) ఎ) ఆస్ట్రేలియా బి) నెదర్లాండ్స్ సి) స్వీడన్ డి) దక్షిణ కొరియా వివరణ: నీటిపై తేలియాడే నగరాన్ని దక్షిణ కొరియా దేశంలో నిర్మించనున్నారు. బుసాన్ నగర తీరంలో ఇది రానుంది. దీని నిర్మాణానికి గాను బుసాన్ మెట్రోపాలిటన్ నగరం, ఐక్యరాజ్య సమితి ఆవాస సంస్థ, న్యూయార్క్కు చెందిన ఓషియానిక్స్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. నీటిపై తేలియాడే వెదురు బొంగుల సహాయంతో మొదట షడ్భుజాకార పునాదుల వంటి వేదికలను నిర్మిస్తారు. అలల ధాటికి కొట్టుకుపోకుండా సముద్రగర్భంలో వాటికి లంగరు వేస్తారు. కాంక్రీట్ కంటే 2-3 రెట్లు గట్టిదయిన సున్నపురాయితో వెదురు వేదికలపై పూత ఏర్పాటు చేసి ఏడు అంతస్తుల వరకు భవనాలు నిర్మించేలా చూస్తారు.
బి.1.1.529 ఏ దేశంలో వెలుగు చూసింది? (బి) ఎ) ఇజ్రాయెల్ బి) దక్షిణాఫ్రికా సి) హాంకాంగ్ డి) బోట్సువానా వివరణ: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రకం బి.1.1.529 వెలుగు చూసింది. దీనికి ఒమిక్రాన్ అని పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాకు పొరుగున ఉన్న బోట్సువానాతో పాటు హాంకాంగ్ దేశానికి కూడా ఇది వ్యాపించినట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్ ప్రావిన్స్లో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందిందని స్థానిక వైద్యులు తెలిపారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చూసిన వేరియంట్ల కంటే ఒమిక్రాన్ ప్రమాదకరమైంది కావచ్చని శాస్త్రజ్ఞుల భావన. అయితే పూర్తిస్థాయిలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. వైరస్ స్పైక్ ప్రొటీన్లో 32 ఉత్పరివర్తనాలను గుర్తించారు. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఇవి రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు విశ్లేషించారు.
ఏ రాష్ట్రంలో రాణి గైడెన్లు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియాన్ని ఇటీవల ప్రారంభించారు? (సి) ఎ) నాగాలాండ్ బి) మేఘాలయా సి) మణిపూర్ డి) అస్సాం వివరణ: మణిపూర్ రాజధాని ఇంఫాల్లో రాణి గైడెన్లు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ ప్రభుత్వంతో అత్యంత సాహసంగా పోరాడిన గిరిజన మహిళ పేరు ‘గైడెన్లు’. ఆమెకు రాణి అనే పేరును జవహర్లాల్ నెహ్రూ ఇచ్చారు. మణిపూర్తో పాటు నాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్రిటిష్కు వ్యతిరేకంగా ఆమె ఉద్యమించారు. 1915 జనవరి 16న జన్మించిన ఆమె తన పదహారో ఏట అరెస్ట్ అయ్యారు. జీవితకాల ఖైదును ఆమెకు విధించారు. 1947లో స్వాతంత్య్రం వచ్చాక ఆమెను విడుదల చేశారు.
నదీ నగరాల కూటమిలో తెలంగాణ నుంచి సభ్యత్వం తీసుకున్న నగరం? (ఎ) ఎ) హైదరాబాద్ బి) వికారాబాద్ సి) నిర్మల్ డి) భద్రాద్రి కొత్తగూడెం వివరణ: దేశంలో నదుల పక్కన వెలసిన 30 ప్రధాన నగరాలు ఒక కూటమి (రివర్ సిటీ అలయన్స్)గా ఏర్పడ్డాయి. పెరుగుతున్న పట్టణీకరణతో తలెత్తుతున్న ముప్పుపై చర్చించి, అందుకు పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఈ నగరాలు ఒక్కటయ్యాయి. కేంద్ర జలశక్తి, పట్టణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నగరాల సమావేశం నవంబర్ చివరి వారంలో నిర్వహించారు. తెలుగు రాష్ర్టాల నుంచి హైదరాబాద్, విజయవాడ ఈ కూటమిలో చేరాయి. నెట్వర్కింగ్, సామర్థ్య నిర్వహణ, సాంకేతిక సహాయం అనే మూడు అంశాలపై ప్రధానంగా కూటమి దృష్టి సారిస్తుంది.
తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం…? (బి) ఎ) లింగ నిష్పత్తి తగ్గింది బి) లింగ నిష్పత్తి పెరిగింది సి) లింగ నిష్పత్తి యథాతథంగా ఉంది డి) ఏదీకాదు వివరణ: దేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 24న విడుదల చేసిన గణాంకాల్లో తెలిపింది. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 రెండో దశ నివేదికలో వివిధ అంశాలను వెల్లడించింది. ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళలు 1020 ఉన్నట్లు పేర్కొంది. అయితే చిన్నారులు, మహిళల్లో రక్తహీనత బాధితుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. 2020 డిసెంబర్లో సేకరించిన 22 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డేటాను కలిపి పూర్తిస్థాయి ప్రస్తుతం నివేదికను విడుదల చేసింది.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని ప్రత్యేకత ఏంటి? (సి)
శూన్య ఉద్గారాల విమానాశ్రయంగా నిలవనుంది
దేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా నిలవనుంది ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు వివరణ: ఉత్తరప్రదేశ్లోని జెవర్ వద్ద నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి నవంబర్ 25న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఇది రెండో ఇంటర్నేషనల్ ఏరోడ్రోమ్. దీని నిర్మాణం 2024 నాటికి పూర్తి కావచ్చని భావిస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక దేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా మారనుంది. అలాగే భారతదేశపు శూన్య ఉద్గారాల తొలి విమానాశ్రయంగా నిలువనుంది. మరోవైపు దేశంలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలువనుంది.
ఏ రాష్ట్రంలో సైబర్ తహసీల్ను ఏర్పాటు చేయనున్నారు? (డి) ఎ) కేరళ బి) మహారాష్ట్ర సి) ఒడిశా డి) మధ్యప్రదేశ్ వివరణ: సైబర్ తహసీళ్ల ఏర్పాటుకు మధ్యప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం ఇదే. రాష్ట్రంలో ఎక్కడ నుంచి అయినా తహసీల్ సేవలు పౌరులకు అందుబాటులోకి రానున్నాయి.
నీతి ఆయోగ్ విడుదల చేసిన బహుళ పేదరిక సూచీలో కింది ఏ అంశం పరిగణనలోకి తీసుకోలేదు? (బి) ఎ) ఆరోగ్యం బి) ఉద్యోగ భద్రత సి) విద్య డి) జీవన ప్రమాణాలు వివరణ: బహుళ పేదరిక సూచీ ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ ఇటీవల ఒక సూచీని విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్ఫర్డ్ పావర్టీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లు సంయుక్తంగా ఈ సూచీని రూపొందించాయి. ఇందులో ఆరో గ్యం, విద్య, జీవన ప్రమాణాలు అనే అంశాల ప్రాతిపదికన పేదరికాన్ని గణించారు. వీటికి ఉప అంశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం-ఇందులో పోషణ, శిశు-కౌమార దశ మరణాలు, చిన్నారుల జననం తర్వాత అందే వైద్య సౌకర్యం అంశాలను పరిశీలిస్తారు. విద్యలో భాగంగా పాఠశాల సంవత్సరాలు (ఇయర్ ఆఫ్ స్కూలింగ్), పాఠశాల హాజరు అనే ఉప అంశాలు ఉన్నాయి. జీవన ప్రమాణం అనే అంశంలో ఏడు ఉప అంశాలు ఉన్నాయి. అవి వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ఇళ్లు, ఆస్తులు, బ్యాంక్ ఖాతా.
నీతి ఆయోగ్ విడుదల చేసిన బహుళ పేదరిక సూచీలో అత్యధిక పేదరికం ఏ రాష్ట్రంలో ఉంది? (సి) ఎ) జార్ఖండ్ బి) ఉత్తరప్రదేశ్ సి) బీహార్ డి) మధ్యప్రదేశ్ వివరణ: దేశంలోనే అత్యధిక పేదరికం బీహార్ రాష్ట్రంలో ఉందని నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడయ్యింది. ఆ రాష్ట్రంలో 51.9% మంది పేదలున్నట్లు తేలింది. ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో 42.16% మంది పేదలు ఉన్నారు. అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఆ రాష్ట్రంలో 0.71% మాత్రమే పేదలున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. అతి ఎక్కువ పేదరికం ఉన్న తొలి అయిదు రాష్ర్టాలు.. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ. అతి తక్కువ పేదరికం ఉన్న తొలి అయిదు రాష్ర్టాలు.. కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, గోవా, సిక్కిం.
తెలంగాణలో ఏ జిల్లాలో అత్యధిక పేదరికం నమోదైంది? (ఉమ్మడి జిల్లాల వారీగా) (డి) ఎ) మహబూబ్ నగర్ బి) ఖమ్మం సి) నల్లగొండ డి) ఆదిలాబాద్ వివరణ: తెలంగాణలో 13.74% ప్రజలు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నట్లు నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పేదలున్న జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ నిలిచింది. అతి తక్కువ మంది పేదలున్న జిల్లాగా హైదరాబాద్ ఉంది. ఆదిలాబాద్లో 27.43% మంది పేదలున్నట్లు సూచీలో పేర్కొన్నారు.
వేతన రేట్ సూచీ తాజా ఆధార సంవత్సరం? (ఎ) ఎ) 2016 బి) 2011 సి) 2020 డి) 2021 వివరణ: కొత్త వేతన రేటు సూచీ (డబ్ల్యూర్ఐ) శ్రేణిని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నవంబర్ 24న విడుదల చేసింది. ఆధార సంవత్సరాన్ని 1963-65 నుంచి 2016కు మార్చింది. ఆర్థిక వ్యవస్థలో మార్పులు, ఉద్యోగుల వేతన సరళిని ప్రతిబింబించేలా ప్రధాన ఆర్థిక సూచీల ఆధార సంవత్సరంలో కాలానుగుణంగా ప్రభుత్వం మార్పులు చేస్తుంది. కనీస వేతనాల నిర్ణయంలో ఈ ఆధార సంవత్సర శ్రేణి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంవత్సరం ఎంపికను సూచించింది ఎస్పీ ముఖర్జీ కమిటీ. మొత్తంగా 37 పరిశ్రమలను కొత్త వేతన సూచీ బోర్డుకు మార్చారు. గత ఆధార సంవత్సరంలో కేవలం 21 పరిశ్రమలు మాత్రమే ఉండేవి
భారత ఆర్థిక వ్యవస్థపై ఎస్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం కింది వాటిలో సరైనవి? (సి)
ఆర్థిక వ్యవస్థ సంఘటిత రూపంలోకి మారుతుంది
ఆర్థిక వ్యవస్థ అసంఘటిత దిశగా వెళుతుంది
డిజిటలీకరణ ప్రక్రియ వేగవంతం అవుతుంది ఎ) 3 బి) 2, 3 సి) 1, 3 డి) 2 వివరణ: ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయి సంఘటిత (అధికారిక లెక్కల పరిధిలోకి) రూపంలోకి మారే దిశగా వేగంగా అడుగులు వేస్తుందని ఎస్బీఐ తన పరిశోధన నివేదికలో వెల్లడించింది. అసంఘటిత రంగ వాటా గణనీయంగా తగ్గిందని పేర్కొంది. అలాగే దేశంలో డిజిటలీకరణ ప్రక్రియ వేగవంతం అవుతూ ఉండటం వల్ల సంఘటిత రంగం దిశగా పయనించడానికి కారణమని విశ్లేషించింది. స్థూల విలువ జోడింపులో సంఘటిత రంగం వాటా 2020-21లో 80 శాతానికి చేరిందని, అసంఘటిత రంగం వాటా 15-20 శాతానికి పడిపోయిందని లెక్కకట్టింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చేపట్టిన చర్యలు ఆర్థిక వ్యవస్థకు డిజిటల్ రూపును తీసుకొచ్చాయని వెల్లడించింది. కొవిడ్-19 పరిణామాల అనంతరం ఆర్థిక వ్యవస్థలో సంఘటిత వాటా మరింత పెరిగిందని పేర్కొంది.
దేశంలో అత్యాధునిక ఎంఆర్ఐ సౌకర్యాన్ని ఏ రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చారు? (ఎ) ఎ) హర్యానా బి) గుజరాత్ సి) మహారాష్ట్ర డి) గోవా వివరణ: దేశంలో తొలిసారిగా అత్యాధునిక ఎంఆర్ఐ సౌకర్యాన్ని హర్యానా రాష్ట్రంలో మానెసర్లో ఉన్న నేషనల్ బ్రెయిన్ రిసెర్చ్ సెంటర్లో అందుబాటులోకి తెచ్చారు. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్. రేడియాలజీలో దీనిని వినియోగిస్తారు. మానవ న్యూరో సైన్స్కు సంబంధించి భారత్లో ఈ సౌకర్యం ఒక కొత్త విప్లవానికి నాంది కానుంది. స్కానింగ్ అత్యంత వేగంగా పూర్తి కానుంది. దీంతో మెరుగైన చికిత్స అందుబాటులోకి వస్తుంది. మెదడులో అత్యంత సున్నితంగా ఉండే రెసిప్టార్, యాంటీ యాక్సిడెంట్లను కూడా గుర్తించేందుకు వీలు కల్పిస్తుంది.
‘దోస్తీ విన్యాసాల్లో’ భాగం కాని దేశం? (బి) ఎ) భారత్ బి) బంగ్లాదేశ్ సి) శ్రీలంక డి) మాల్దీవులు వివరణ: భారత్, శ్రీలంక, మాల్దీవుల దేశాలకు చెందిన కోస్ట్గార్డ్ల విన్యాసాలు ‘దోస్తీ’ పేరుతో నవంబర్ 20 నుంచి 24 వరకు అయిదు రోజుల పాటు నిర్వహించారు. పరస్పర సామర్థ్యాలను పెంచుకోవడం, దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాల పెంపు తదితర లక్ష్యాల సాధనకు దీనిని చేపట్టారు. మూడు దేశాల మధ్య చేపట్టిన ఈ విన్యాసం 15వది. ఈ ఏడాది ఇవి మాల్దీవుల దేశంలో నిర్వహించాయి.
ఇంటర్పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆసియా ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? (సి) ఎ) జగదీశ్ బి) వివేక్ జోహ్రీ సి) ప్రవీణ్ సిన్హా డి) వసంత్ కుమార్ వివరణ: ఇంటర్పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆసియా ప్రతినిధిగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా నియామకం అయ్యారు. ఇంటర్పోల్కు చెందిన ఉన్నత కమిటీలో వివిధ పదవులకు ఇస్తాంబుల్లో నిర్వహించిన 89వ జనరల్ అసెంబ్లీలో ఎన్నికలు నిర్వహించారు. 2022లో ఇంటర్పోల్ 91వ సర్వసభ్య సమావేశానికి భారత్ అతిథ్యం ఇవ్వనుంది. జగదీశ్: నానో టెక్నాలజీ రంగంలో కృషి చేస్తున్న చెన్నుపాటి జగదీశ్ ఆస్ట్రేలియన్ సైన్స్ అకాడమీ తదుపరి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. వివేక్ జోహ్రీ: కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ చైర్మన్గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి వివేక్ జోహ్రీ నియామకం అయ్యారు. వసంత్ కుమార్: రిసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిక్స్ ఇన్ ఇండియా అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన వసంత్ కుమార్ నియామకం అయ్యారు.