న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా విషయమై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. వ్యాక్సిన్ వేసుకోండి అని కేంద్రం ఫోన్ లలో వినిపిస్తున్న సందేశాన్ని ఎద్దేవా చేసింది. కాల్ చేసిన ప్రపతచిసారీ మీరు ఆ చిరాకు కలిగించే సందేశాన్ని వినిపిస్తున్నారు. కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మీరు ప్రజలకు టీకాలు ఇవ్వడం లేదు. పైగా వ్యాక్సిన్ లగ్వాయేగా (టీకా వేసుకోండి) అని ఫోన్ సందేశం ఇస్తున్నారు. అక్కడ వ్యాక్సినే లేదంటే ‘కౌన్ లగ్వాయేగా’ (ఎవరు వేసుకుంటారు) అని చురకలు వేసింది. జైళ్లల్లో రద్దీ తగ్గించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం అమలులో పాలుపంచుకునే న్యాయవాదులకు టీకా ఇస్తారా అని కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వారు తమ బాధ్యతల పరిపూర్తికి జైళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.. ఆయుధాలు లేకుండా యుద్ధానికి ఎలా పంపుతారు? అని నిలదీసింది.