సిటీబ్యూరో, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): అత్తింట్లో చోరీకి పాల్పడ్డ అల్లుడిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు. బషీర్బాగ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం..మాణికేశ్వర్నగర్కు చెందిన ఎస్.రంగమ్మ అలియాస్ జోగిని రంగమ్మ(60) యువతిని దత్తత తీసుకుని.. మండల లక్ష్మణ్ తో వివాహం చేసింది. ఆ దంపతులు కూడా రంగమ్మ ఇంట్లోనే ఉంటున్నారు. పెయింటర్ వృత్తిలో ఉన్న లక్ష్మణ్ చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. వీటి నుంచి బయటపడేందుకు అత్తింట్లో చోరీకి స్కెచ్ వేసుకున్నాడు. గత నెలలో రంగమ్మ కాశీ యాత్రకు వెళ్లగా, అవకాశంగా తీసుకున్న లక్ష్మణ్.. అదే నెల 23న రాత్రి తన భార్య నిద్రపోగానే.. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను ఆఫ్ చేసి.. అల్మారాలోని లాకర్లో రంగమ్మకు వంశపారంపర్యంగా వచ్చిన కేజీకి పైగా నగలు, రూ. 12 లక్షల నగదును తస్కరించాడు. వాటర్ ట్యాంక్లో బంగారం ఆభరణాలు, వేరే గదిలో వడ్డాణం.. ఇలా ఆభరణాలను పడేసి.. అవకాశం ఉన్నప్పుడల్లా వాటిని అమ్ముకున్నాడు. కాశీ నుంచి తిరుగొచ్చిన రంగమ్మ తన ఆభరణాలను తస్కరించినట్లు ఈ నెల 1న ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు లక్ష్మణ్ను అదుపులోకి విచారించడంతో విషయం బయటపడింది. అతడి వద్ద నుంచి కేజీ బంగారం, 12 లక్షల నగదును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందించారు. 48 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీస్ బృందాన్ని సీపీ అభినందించారు.