హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పరిశ్రమలకు కేంద్ర బడ్జెట్ 2022-23లో చేయూత లభించలేదు. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు ఈ బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ ఇందులో మన రాష్ర్టానికి ఏ మేరకు నిధులు వస్తాయన్నది అంతుచిక్కని ప్రశ్నే. ఈసీఎల్జీఎస్ వల్ల మన రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు చెప్పుకోదగ్గ ప్రయోజనం చేకూరలేదు.
తగ్గని భారం: బడ్జెట్లో రాష్ర్టానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) అధ్యక్షుడు సుధీర్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలను ఆదుకొనేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని, కనీసం రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఏ ప్రాజక్టునూ కేంద్రం ఆమోదించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై చైనా, కొరియాలాంటి దేశాల్లో వడ్డీ 6-7 శాతం మించడం లేదని, మన దేశంలో మాత్రం 12-14 శాతం వరకూ వసూలు చేస్తున్నారని తెలిపారు.
మార్గదర్శకాలతోనే..
ఈసీఎల్జీఎస్పై బ్యాంకర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తేనే ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుంది. లేకుంటే ఈ పథకం కాగితాలకు మాత్రమే పరిమితమవుతుంది.