హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ‘రాహుల్ గాంధీ.. వ్యవసాయంపై మీ విధానం ఏమిటి? అసలు మీకు ఆ రంగంపై కనీస అవగాహనైనా ఉన్నదా? మీరు వరంగల్ సభలో ప్రకటిస్తానన్న అగ్రి పాలసీ తెలంగాణకా? దేశానికా?’ అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ విధానం దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నదన్న వినోద్.. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని వ్యవసాయ విధానం దారుణంగా ఉన్నదని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో రైతులు ఎకరం భూమిలో 30 క్వింటాళ్లు పండిస్తే, కేవలం 15 క్వింటాళ్ల ధాన్యమే కొంటున్నారని చెప్పారు.
‘తెలంగాణలో రైతు బంధు కింద ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతు చనిపోతే బీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నాం. ఇలాంటి పథకాలు కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉన్నాయా? 24 గంటల ఉచిత కరెంటు.. కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఉన్నదా? తెలంగాణలో వ్యవసాయానికి పుషలంగా సాగునీరు అందిస్తున్నాం. సాగునీటి లభ్యత వల్ల లక్ష్యానికి మించి పంటలు పండాయి. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాగు నీటి లభ్యత ఉన్నదా?’ అని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేక రైతు సంక్షేమ పథకాలను తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నదని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆ పథకాలను అమలు చేస్తున్నారా? అని రాహుల్ను ప్రశ్నించారు.