ముంబై : పత్రాచాల్ భూకుంభకోణం కేసులో శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఈడీ అధికారులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సంజయ్ రౌత్తో పాటు ఆయన భార్య వర్షపై ఉన్న ఆరోపణలు ఏంటో చూద్దాం
పత్రాచాల్ కేసు ఏంటి?
మహారాష్ట్ర హౌజింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీతో 2007లో గురు ఆశిష్ కన్స్ట్రక్షన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ఒప్పందం ప్రకారం 672 ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ముంబైలోని శివారు ప్రాంతం గోరేవాన్లో పత్రాచాల్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంది. అక్కడ కొత్త ఇండ్లు కట్టి, ఎంహెచ్ఏడీఏను డెవలప్ చేయాలి. అలాగే మిగితా భూమిని ప్రైవేటు డెవలపర్స్కు అప్పగించాలి. కానీ అక్కడ అలాంటి వర్క్స్ జరగలేదన్నది ఆరోపణ.
ఈడీ ప్రకారం.. సంజయ్ రౌత్తో పాటు ఆయన సన్నిహితుడు ప్రవిన్ రౌత్లు.. గురు ఆశిశ్ కన్స్ట్రక్షన్స్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఒప్పందం ప్రకారం 672 ఇండ్లలో ఒక్కటి కూడా కట్టలేదు. అక్కడి ఫ్లోర్ స్పేస్ను 9 మంది ప్రైవేటు డెవలపర్స్కు అమ్మేశారు. దాని ద్వారా సుమారు 901.79 కోట్లను ఆర్జించారు. ఇండ్లు కట్టకుండానే గురు ఆశిష్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ద మిడౌస్ అనే మరో ప్రాజెక్టును చేపట్టింది. ఫ్లాట్లను బుక్ చేసి అదనంగా 138 కోట్లు సేకరించింది. అయితే అక్రమ రీతిలో సుమారు 1039.79 కోట్లను గురు ఆశిష్ సంస్థ సేకరించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
సంజయ్ రౌత్, ఆయన భార్యపై ఉన్న ఆరోపణలు ఏంటి ?
హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ప్రవీణ్ రౌత్ 100 కోట్లు తీసుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది. ఆ మొత్తాన్ని తన సన్నిహితుల అకౌంట్లకు తరలించినట్లు తెలుస్తోంది. సంజయ్ రౌత్ ఫ్యామిలీ సభ్యులకు కూడా మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది. ప్రవీణ్ రౌత్ భార్య మాధురి రౌత్ నుంచి సంజయ్ భార్య వర్షా రౌత్కు 83 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ డబ్బుతో దాదార్లో వర్షా ఫ్లాట్ కొన్నది. ఈడీ విచారణ తర్వాత వర్షా 55 లక్షలు మాధురి రౌత్కు ట్రాన్స్ఫర్ చేసినట్లు తేలింది.
ఈ కేసులో సంజయ్ రౌత్ను గతంలో జూలై ఒకటో తేదీని విచారించారు. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను ఆదివారం సుమారు 10 గంటల పాటు ప్రశ్నించారు. ఇక ఏప్రిల్లో వర్షా రౌత్కు చెందిన 11 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. ఆమెకు చెందిన సన్నిహితుల ఆస్తుల్ని కూడా సీజ్ చేశారు. అలీబాగ్, దాదార్లో ఉన్న 8 ప్లాట్లను ఈ కేసుతో అటాచ్ చేశారు. పత్రాచాల్ కుంభకోణం కేసులో ప్రవిణ్ రౌత్ను ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ చెరలో ఉన్న సంజయ్ రౌత్ను మెడికల్ చెకప్ కోసం ఇవాళ జేజే హాస్పిటల్ తీసుకువెళ్లారు. పీఎంఎల్ఏ జడ్జి ఎంజీ దేశ్పాండే ఈ కేసును విచారించనున్నారు.