న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారతీ ఎయిర్టెల్ టారీఫ్లు మరోసారి పెరగనున్నాయి. ఈ ఏడాది ప్లాన్ల చార్జీలను పెంచుతామన్న సంకేతాలను సంస్థ తాజాగా ఇచ్చింది. రాబోయే 3-4 నెలల్లో పెంపు ఉండకపోయినా.. డిసెంబర్లోగా తప్పదని ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ చెప్పారు. ఈ క్రమంలోనే మొబైల్ కాల్, సర్వీసెస్ రేట్లను పెంచడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పరిశ్రమలో ప్రత్యర్థి సంస్థల కంటే ముందుగా చార్జీలను పెంచేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని తేల్చిచెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి (క్యూ3)గాను మంగళవారం భారతీ ఎయిర్టెల్ తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫలితాలపై బుధవారం గోపాల్ విఠల్ మాట్లాడారు. ఇప్పటికే పెంచిన చార్జీలు సంస్థకు కలిసొచ్చాయన్న విఠల్.. ఇకపైనా ఈ తరహా లాభాన్ని వొదులుకోబోమనడం గమనార్హం. గతేడాది నవంబర్లో తొలుత చార్జీలను 18-25 శాతం మేర ఎయిర్టెలే పెంచింది.
రూ.200లకు ఏఆర్పీయూ
ఈ ఏడాది ఒక్కో వినియోగదారుడి నుంచి పొందే సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) రూ.200లకు తీసుకెళ్లాలని ఎయిర్టెల్ చూస్తున్నది. అక్టోబర్-డిసెంబర్లో సంస్థ ఏఆర్పీయూ రూ.163గా ఉన్నది. క్రితంతో చూస్తే ఇది 2.2 శాతం తక్కువ. దీంతో దీన్ని మళ్లీ పెంచాలన్న నిర్ణయానికే సంస్థ వచ్చింది. తద్వారా తమ ఒక్కో కస్టమర్పై రూ.37 చొప్పున అదనపు భారం రాబోయే రోజుల్లో పడబోతున్నదని ఎయిర్టెల్ చెప్పకనే చెప్తున్నది. నిజానికి ప్రస్తుత చార్జీలే మొబైల్ యూజర్లకు పెను భారంగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలన్నీ నష్టాల పేరుతో ప్లాన్ల ధరలను ఇప్పటికే అనేకసార్లు పెంచుతూ వచ్చాయి. దీంతో ఒకప్పుడు చౌకగా ఉన్న డాటా కాస్తా ఇప్పుడు పిరమైపోయింది. నెలసరి కనీస రీచార్జ్ల ధరలూ భారీగా పెరిగాయి.