హైదరాబాద్ : స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ( Weapons ) ఇచ్చే అంశం ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అన్నారు. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయుధాలను అప్పగిస్తామని వెల్లడించారు.
తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను రవీంద్రభారతిలో మంత్రి జూపల్లి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకూ తరిమికొట్టి, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ సురేష్ రాథోడ్, జాయింట్ కమిషనర్ జి.అంజన్ రావు, డిప్యూటీ కమిషనర్ జె. హరికిషన్, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూర కృష్ణ, జనరల్ సెక్రటరీ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.