హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానంలో రాబోయే రోజుల్లో తెలంగాణ దేశంలోనే ముందుంటుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటికే వివిధ ఐటీ, పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు జరిగినట్టు చెప్పారు. డాటా సైన్స్ విద్యార్థులకు టీసీఎస్ సంస్థతో అంగీకారం కుదిరినట్టు గుర్తుచేశారు. మంగళవారం హెచ్ఐసీసీలో భారత పరిశ్రమల సమాఖ్య, తెలంగాణ సాంకేతిక, ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘పరిశ్రమల భాగస్వామ్యంతో ఉన్నత విద్యలో అకడమిక్ ఎక్సలెన్స్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు.
పరిశ్రమలకు విద్యాసంస్థలను అనుసంధానించడంలో కొంత గ్యాప్ ఉన్న మాట వాస్తవమని, దీనిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. విద్యాసంస్థలతో కలిసి సాగడానికి పరిశ్రమల యజమానులు ముందుకురావాలని సాంకేతిక, ఉన్నత విద్యా కమిషనర్ నవీన్మిట్టల్ పిలుపునిచ్చారు. పాలిటెక్నిక్ చివరి సంవత్సరం విద్యార్థులు పరిశ్రమల్లో పనిచేసే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జేఎన్టీయూ వీసీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమలతో విద్యాసంస్థలకు జరగాల్సిన అనుసంధానంపై ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక ఇస్తామని తెలిపారు.