న్యూఢిల్లీ, మార్చి 2: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్..తన బీమా సాధనాలను,సర్వీసుల్ని పెంపొందించేందుకు డిజిటల్, బ్యాంక్అష్యూరెన్స్పై దృష్టిపెడుతుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మిని ఐపే చెప్పారు. స్థూల ప్రీమియం, కొత్త పాలసీల్లో ఎల్ఐసీకి ప్రస్తుతం 2/3 శాతం మార్కెట్ వాటా ఉన్నదని, గ్రూప్ కొత్త బిజినెస్ ప్రీమియంలో 75 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు ఆమె వివరించారు. ప్రైవేటు బీమా సంస్థల నుంచి పోటీ పెరుగుతున్నా, తాము ఖాతాదారుల్ని సంప్రదించే విధానం, సంస్కృతితో మార్కెట్లో సంస్థ స్థానం చెక్కుచెదరడం లేదన్నారు. వినూత్నమైన బీమా పత్రాలను తీసుకురావడానికి, కొత్త పంపిణీ పద్దతుల్ని ప్రవేశపెట్టడానికి తాము నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. భౌతికంగా తాము కస్టమర్లకు సేవలందిస్తున్న తరహాలోనే ప్రస్తుతం డిజిటల్గా కూడా పనిచేస్తున్నామన్నారు.