అనంతగిరి, మే 16 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ మాట్లాడుతూ.. ఒక్క దోమ అనేక ప్రమాదాలు అనే నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఏడీస్ ఈజిప్ట్ దోమ వల్ల వ్యాధి వస్తుందన్నారు. మన ఇంటి లోపల ఉండే పూల కుండీలు, కూలర్లు, మంచినీటి తొట్లు, కొబ్బరి బోండాలు, నిల్వ ఉన్న మంచి నీటి పరిసరాలలో స్థావరం ఏర్పాటు చేసుకుని జబ్బు బారిన పడిన వ్యక్తి నుండి వాహకాన్ని మోసుకొచ్చి కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందన్నారు. కావునా ఇంటి పరిసరాలలో వారానికి ఒకసారి నీరు నిల్వ లేకుండా డ్రై డే పాటించాలని సూచించారు. ఎవరికైనా జ్వరం బారిన పడినట్లయితే ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో రక్త పరీక్షలు నిర్వహించుకుని నిర్ధారణ అయితే మందులు వాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ ఉపేందర్, సూపర్వైజర్ ఉమామహేశ్వరి, యాతాకుల మధుబాబు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.