న్యూఢిల్లీ, మార్చి 28: ఇండ్లు కొనడానికి రాయితీలు, సౌకర్యవంతమైన చెల్లింపు విధానాలను అత్యధికులు ఆశిస్తున్నారు. హౌజింగ్.కామ్, రియల్టర్ల సంఘం నరెడ్కో నిర్వహించిన సర్వేలో ఇండ్లను కొనేందుకు అవకాశమున్న 73 శాతం మందిది ఇదే మాట. అలాగే ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 51 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో ఇండ్ల ధరలు పెరుగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టీల్, సిమెంట్ తదితరాల ధరలు పెరిగిన దృష్ట్యా.. మున్ముందు ఇండ్ల ధరలు పరుగులు పెడతాయనే ఎక్కువమంది అంటున్నారు. వినియోగదారుల మనోభావాలను అంచనా వేయడానికి ఈ ఏడాది ప్రథమార్ధానికిగాను 3వేల మందికిపైగా అభిప్రాయాలతో ‘రెసిడెన్షియల్ రియల్టీ కన్జ్యూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ (జనవరి-జూన్ 2022)’ పేరుతో సర్వేను తయారు చేశామని హౌజింగ్.కామ్ ఓ ప్రకటనలో తెలియజేసింది.
స్టాక్ మార్కెట్లు, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి సాధనాల్లో కంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని హౌజింగ్.కామ్, నరెడ్కో ఈ సందర్భంగా తెలిపాయి. తమ సర్వేలో 47 శాతం మంది రియల్టీ పెట్టుబడులకే మొగ్గు చూపినట్టు వివరించాయి. ముఖ్యంగా ఒక్కసారి ఇండ్లను చూసే 40 శాతం మంది ఆన్లైన్లో లావాదేవీలను ముగించేస్తున్నారని తెలిపాయి. అలాగే పూర్తయిన ఇండ్లను కొనేందుకే 57 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. సకాలంలో ఇండ్ల నిర్మాణాల్ని పూర్తిచేస్తే డిమాండ్ మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని హౌజింగ్.కామ్, నరెడ్కో వ్యక్తం చేస్తున్నాయి.
గృహ రుణాల వడ్డీరేట్లపై పన్ను రిబేట్లను పెంచాలని, ఉక్కు, సిమెంట్ వంటి నిర్మాణ రంగ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి హౌజింగ్.కామ్, నరెడ్కో ఈ సందర్భంగా సూచించాయి. చిన్న డెవలపర్లకు రుణ సదుపాయాలను కల్పించాలని, స్టాంప్ డ్యూటీలకు కోత పెట్టాలని కూడా కోరాయి. కాగా, విద్యా సంస్థలు, దవాఖానలు తదితర వసతులు కొనబోయే ఇండ్లకు 1-1.5 కిలోమీటర్ల దూరంలో ఉండాలని మెజారిటీ కొనుగోలుదారులు చెప్తున్నారు. మరోవైపు కిలో స్టీల్ ధర రూ.50, బస్తా సిమెంట్ రేటు సుమారు రూ.100 పెరగడంతో నిర్మాణ వ్యయం 20-25 శాతం పెరిగిందని, మరో 10-15 శాతం పెరగవచ్చని క్రెడాయ్ అంటున్నది. పెరుగుతున్న ఇంధన ధరలు పెద్ద ఎత్తునే ప్రభావితం చేయగలవన్నది.
‘ప్రతి ఒక్కరికీ సొంతిల్లు అవసరాన్ని కరోనా వైరస్ పెంచింది. ప్రజలు కూడా మరింత సౌకర్యవంతమైన, పెద్ద ఇండ్లనే కోరుకుంటున్నారు. నిరుడు ఇండ్ల అమ్మకాలు 13 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో కరోనా కంటే ముందున్న స్థాయిని ఈ ఏడాది విక్రయాలు దాటేస్తాయనిపిస్తున్నది’
ధ్రువ్ అగర్వాల, హౌజింగ్.కామ్ సీఈవో
‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యంపై, తమతమ ఆదాయాలపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. ఇది మాకు కలిసొచ్చే అంశం. దాదాపు 50 శాతం మంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు. డిమాండ్ బలంగా ఉందనడానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు’
రాజన్ బండేల్కర్, నరెడ్కో అధ్యక్షుడు