శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై వరుసగా రవితేజ, నాని, శర్వానంద్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా మార్చి 4న విడుదలవుతున్నది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను తెలిపారు నిర్మాత సుధాకర్
చెరుకూరి.
చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్లాను. అక్కడ ఐటీ కంపెనీ నడిపాను. సినిమాల మీద ఆసక్తితో తర్వాత ఇండియా వచ్చి ప్రొడక్షన్ ప్రారంభించాను. మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్, 14 రీల్స్ రామ్, గోపీ, షైన్ స్క్రీన్స్ సాహూ మేమంతా స్నేహితులం. ఒకర్ని చూసి ఒకరం ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం.
హీరో శర్వానంద్ నాకు ఒక సోదరుడి లాంటివాడు. ఆయనతో పడిపడి లేచె మనసు సినిమా చేశాక కుటుంబ కథతో సినిమాను నిర్మించాలని అనిపించింది. దర్శకుడు కిషోర్ తిరుమల దగ్గర అలాంటి కథ ఉందని తెలిసి సంప్రదించాము. అలా ఈ సినిమా మొదలైంది. మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి ఇలాంటి కథలను ఇష్టపడతాను. ఉమ్మడి కుటుంబంలో పది మంది మహిళల మధ్య పెరిగిన ఒక యువకుడి కథ ఇది. ఆద్యంతం కుటుంబ విలువలు, వినోదంతో సాగుతుంది. వాస్తవానికి ఆర్నెళ్ల ముందే విడుదల కావాల్సిన చిత్రమిది. రష్మిక, ఖుష్బూ, రాధిక డేట్స్ అనుకున్నట్లు దొరక్క ఆలస్యమైంది.
లాక్డౌన్ తర్వాత కుటుంబ ప్రేక్షకులు సినిమాలకు రావడం తగ్గింది. మా చిత్రంతో వాళ్లందరినీ థియేటర్లకు రప్పిస్తామని ఆశిస్తున్నాం. సినిమాలోని ఏదో ఒక పాత్రను మీరు నిజ జీవితంలో చూశాము అనుకుంటారు. పవన్ కళ్యాణ్ ’భీమ్లా నాయక్’తో పోటీ ఎందుకని గత నెల 25న సినిమాను విడుదల చేయలేదు. మార్చి 4న మంచి రిలీజ్ డేట్ అనుకున్నాం. రెండు తెలుగు రాష్ర్టాలతో సహా అమెరికాలోనూ ఎక్కువ కేంద్రాలలో సినిమా విడుదల చేస్తున్నాం.
నిర్మాణ అనుభవంలో కథే ముఖ్యమని తెలుసుకున్నాం. ఇప్పుడు నా సంస్థలో నిర్మితమవుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’,‘దసరా’తో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్న ‘విరాటపర్వం’వేటికవి భిన్నమైన చిత్రాలు. ఈ వైవిధ్యమైన సినిమాలతో మా సంస్థకు మంచి పేరొస్తుందని ఆశిస్తున్నాం. ‘విరాటపర్వం’సినిమాను థియేటర్లో విడుదల చేస్తామా లేక ఓటీటీలోనా అనేది మరో వారంలో తేలుతుంది.