హైదరాబాద్ : వైఎస్ వివేకానంద రెడ్డిది రాజకీయ హత్యగా భావిస్తున్నామని ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి అన్నారు.
హత్య జరిగి రెండేళ్లు అవుతున్నా నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని ఆరోపించారు.
శుక్రవారం వైఎస్ సునీతా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి స్వయానా బాబాయి.. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి సోదరుడని గుర్తుచేశారు.
తమలాంటి వారికే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. న్యాయం కోసం ఇంకా తాము ఎంతకాలం వేచి చూడాలని అన్నారు.
‘నాన్న హత్య కేసులో న్యాయం కోసం అందరి తలుపు తట్టా. ఈ అన్యాయంపై పోరాటంలో అందరి సహకారం కావాలి. హత్య కేసు విచారణలో సాక్షులకు హాని జరుగుతుందని భయంగా ఉంది.
నాన్న హత్య గురించి వాస్తవాలు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. హత్య గుర్తించి వదిలేయాలని చాలామంది సలహా ఇచ్చారు.
నా మనసు మాత్రం న్యాయం కోసం పోరాడాలని చెబుతున్నది. తప్పు జరిగిందని షర్మిలకు తెలుసు. షర్మిల అండగా ఉంటుందని భావిస్తున్నా’ అని వైఎస్ సునీతా రెడ్డి అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి