వైవిధ్య పంటల సాగులో నిర్మల్ జిల్లా టాప్లో నిలిచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సాగునీటి వనరులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సంప్రదాయ పంటలకు రైతాంగం స్వస్తి పలికింది. ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం, వ్యవసాయ అధికారుల సూచనల నేపథ్యంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపే మొగ్గు చూపింది. విభిన్న పంటల సాగు విధానాన్ని అమలు చేసి, రాష్ట్రంలోనే జిల్లాను మొదటిస్థానంలో నిలిపింది. ఈ యేడాది ఆరు నుంచి ఏడు రకాల పంటలు సాగు చేయడమే ఇందుకు కారణంగా అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్నది.
నిర్మల్ టౌన్, మార్చి 11 : వైవిధ్య పంటల్లో నిర్మల్ టాప్లో నిలిచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సాగునీటి వనరులు అధికంగా ఉన్న నిర్మల్ జిల్లాలో సంప్రదాయ పంటలకు రైతులు స్వస్తి పలుకుతున్నారు. విభిన్న పంటల సాగు విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలోనే మొదటిస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక్కడి భూములు, నీటి వనరులను దృష్టిలో పెట్టుకొని రైతులు వానకాలం, యాసంగి సీజన్లలో సంప్రదాయ పంటలకు స్వస్తి పలికారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న, విభిన్న పంటలను సాగు చేయడంతో ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి వరి ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించింది. దీంతో రైతులు వాణిజ్య పంటలతో పాటు విభిన్న పంటల వైపు మొగ్గుచూపారు.
నిర్మల్ జిల్లాలో మొత్తం 19 మండలాలు ఉన్నాయి. 79 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో యాసంగిలో 2.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. గతేడాది యాసంగిలో ప్రధానంగా మక్కజొన్న, వరి, సోయా, వేరుశనగ, మిర్చి, కూరగాయలను ప్రధానంగా సాగు చేశారు. ఈసారి వరిని ప్రభుత్వం వద్దని చెప్పడంతో విభిన్న పంటల వైపు మొగ్గుచూపారు. పంటల సాగులో సంప్రదాయ పంటలతో పాటు కూరగాయలు, చిరుధాన్యాలు, పండ్ల తోటలు సాగు చేయడంతో రాష్ట్రంలో 33 జిల్లాలతో పోల్చితే నిర్మల్ జిల్లాలోనే వివిధ రకాల పంటల సాగు గణనీయంగా పెరిగినట్లు వ్యవసాయశాఖ గణాంకాలతో సహా ప్రభుత్వానికి నివేదించింది. దీంతో వైవిధ్య పంటల సాగులో నిర్మల్ మొదటి స్థానం నిలిచింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల మంది రైతులు పలు రకాల పంటలు సాగు చేస్తునట్లు అధికారులు పేర్కొంటున్నారు. సంప్రదాయ పంటలైన వరి, జొన్న, పత్తి, పసుపు, సోయా, వేరుశనగ తదతర పంటలను గతంలో సాగు చేసేవారు.
సంప్రదాయ పంటలు వేసుకుంటూ నష్టపోయేదానికన్నా వివిధ రకాల పంటలను ఎంచుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసుకుంటూ మార్పిడి పద్ధతులు పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. దీంతో వరి సాగును వదిలా రు. గతంలో రెండు, మూడు పంటలు వేసిన చోట.. ఈసారి ఆరు, ఏడు రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో ప్ర ధానంగా పెసర, మినుము, ధనియాలు, ఎర్రజొన్న, సజ్జ, కొర్ర లు, దోసకాయ, అరటి, ఉల్లి, వెల్లుల్లి, శ్రీగంధం, పుంట్లు, ఆముదం, సామలు, విభిన్న రకాల దోసకాయలు, కూరగాయ లు, పుచ్చకాయ తదితర పంటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా మార్కెట్లో ప్రతి సీజన్లో కూరగాయలకు డిమాండ్ ఉం డడంతో గతంలో వంకాయ, టమాట, బెండకాయ వంటి వా టిని సాగు చేయగా.. ఈసారి తీగజాతి పంటలైన బోడకాకర, కాకర, చిక్కుడు, బొబ్బెర వంటివి సాగు చేస్తున్నారు. వీటికి నీటి తడులు తక్కువ కావడం, మార్కెట్లో మంచి ధరలు బాగా ఉం డడంతో పంటల సాగు విధానంలో మార్పు తీసుకొస్తున్నారు.
రైతులు ప్రతి సీజన్లో సంప్రదాయంగా వేసే పంటల కంటే ఉన్న భూమిలో నాలుగు రకాల పంటలు వేసుకోవడం ఉత్తమం. గతంలో యాసంగిలో వరి, మక్క, జొన్న పంటలు మాత్రమే వేసేవారు. ఈ సారి వరి వద్దని చెప్పడంతో ఆ పంట పొలాల్లో ఎర్రజొన్న, పెసర, మినుము, కొర్రలు, ధనియాలు ఎక్కువగా వేశారు. దీనికితోడు ఆయిల్ సీడ్ రకాలైన నువ్వు, పొద్దుతిరుగుడు పంటలను పదేళ్ల తర్వాత 10 వేల ఎకరాల్లో సాగు చేశారు. మార్కెట్లో ఆయిల్కు మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు మంచి లాభాలు తెస్తున్నాయి.
– మంగ్లారపు ప్రవీణ్కుమార్, వ్యవసాయశాఖ అధికారి
మాది భైంసా మండలంలోని వానల్పాడ్ గ్రామం. మా గ్రామంలో బోర్ల కింద వ్యవసాయం చేస్తాం. పదేళ్ల నుంచి బోర్ల కింద వరి తప్ప ఇతర పంటలు వేసుకునేవాళ్లం కాదు. మార్కెట్లో వరిని అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులున్నా మళ్లీ వేసేవాళ్లం. ప్రభుత్వం వరి వద్దని చెప్పడంతో ఉన్న ఐదెకరాల భూమిలో పెసర, మినుము, బొబ్బెర, శనగ, ధనియాలతో పాటు సజ్జ పంటను సాగు చేశాం. ఈ పంటల సాగుతో భూసారం గణనీయంగా పెరిగింది. ఎరువులను సైతం తక్కువగా వినియోగిస్తున్నాం.
– ప్రవీణ్రెడ్డి, రైతు
మాది సోన్ మండలంలోని సిద్ధులకుంట గ్రామం. ఈ సారి ఎర్రజొన్న పంట వేసిన. గత యాసంగిల మక్క, వరి మాత్రమే సాగు చేసేవాడిని. ఈసారి వరి వద్దని చెప్పడంతో మార్కెట్లో ఎర్రజొన్నకు డిమాండ్ ఉంటుందని భావించి ఐదు ఎకరాల్లో వేసిన. దీనికితోడు ఉన్న భూమిలో ఉల్లి, బొబ్బెర, తొగరి, కూరగాయ పంటలను సాగు చేస్తున్న. ఒక పంటకు మార్కెట్లో ధర లేకపోయినా మిగతా పంటలకైనా ఉంటుందన్న విశ్వాసంతో విభిన్నమైన పంటలు వేశా.
– గంగారెడ్డి, రైతు