Sagar | నల్లగొండ జిల్లా: ఎల్నినో (Elnino) ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా మారాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పాటు బోర్లు కూడా వట్టిపోతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండలోని సీపీఐ(ఎం) దొడ్డి కొమురయ్య భవన్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు, పశువులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి. ఈ కాలువ పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నింపాలని ఆయన డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్లో ప్రస్తుతం 534 అడుగుల వరకు నీరు ఉందని, 34,438 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ఆయన తెలిపారు.
కరువు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం (State Govt) తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని నీటి కోసం కేంద్రం, పొరుగు రాష్ట్రాలపై ఒత్తిడి తేవాలని సూచించారు. నల్లగొండ, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్యను కొంతవరకు పరిష్కరించడంతో పాటు మార్గమధ్యంలోని చెరువులను నింపేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారీ ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాషం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, చినపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.