హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికను మే 27న నిర్వహిస్తారు. నామినేషన్లను మే 2 నుంచి 9 వరకు స్వీకరిస్తారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నియోజకవర్గం నుంచి శాసనమండలిలో ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి ఎన్నికయ్యే వారు 2027 మార్చి 29 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.
నియోజకవర్గం పరిధిలోని మొత్తం 12 జిల్లాల్లో 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గం మొదటి నుంచి బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నది. గతంలో రెండుసార్లు బీఆర్ఎస్ తరఫున కపిలవాయి దిలిప్కుమార్, ఆ తరువాత రెండుసార్లు పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.