కాశీబుగ్గ, మార్చి 26: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుతో పేదలపై అధిక భారం పడిందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. శనివారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు ముందు వంట గ్యాస్ సిలిండర్లు పెట్టి నిరసన తెలిపారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రంలో రెండు పంటలు కొన్నట్లుగానే తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులపై ప్రవర్తించిన తీరు తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం కావాలనే తెలంగాణపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నదన్నారు.
తెలంగాణ ప్రాంతంలోని ఏడు మండలాలతోపాటు లోయర్ సిలేరును ఆంధ్రప్రదేశ్లో కలిపిందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు. కేంద్ర తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలను, రైతులను నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. అందుకే మేధావులు, రైతులు, అన్నివర్గాల ప్రజలు గొంతు విప్పుతున్నారని తెలిపారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. బీజేపీని రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు తిరస్కరిస్తున్నారని తెలిపారు.వరంగల్ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలు ఎల్లావులు లలితాకుమార్ యాదవ్, కార్పొరేటర్లు జన్ను షీభారాణీ అనిల్, తూర్పాటి సులోచనా సారయ్య, నాయకులు ముడుసు నరసింహా, కేతిరి రాజశేఖర్, పత్రి సుభాష్, గండ్రాతి భాస్కర్, గంధం గోవిందు, పత్రి రాజపోషాలు, పసులాది మల్లయ్య, కట్ల నాగరాజు, ఎండీ సలీం, పత్రి సంపత్, పండుగ రవీందర్రెడ్డి, మాధవి, విజయలక్ష్మి, అనిల్ పాల్గొన్నారు.
ధాన్యం కొనేవరకూ పోరాటం..
వర్ధన్నపేట: యాసంగి ధాన్యాన్ని కొనేవరకూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. మండల కేంద్రంలోని వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, కుమారస్వామి, రఘు, సురేశ్, రాజునాయక్ పాల్గొన్నారు.
నర్సంపేట: మోదీ ప్రభుత్వం ప్రజలపై అధిక భారం మోపుతున్నదని ఏఐఎఫ్డీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏఐఎఫ్డీడబ్ల్యూ ఆధ్వర్యంలో నర్సంపేటలో రాస్తారోకో చేశారు. ధరలు పెంచి కేంద్రం సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు నాయకులు గడ్డం స్వరూప, ప్రమీల, నిర్మల, లావణ్య, సుశీల, అనిత, బిందు, మాధవి, సౌందర్య పాల్గొన్నారు.
పర్వతగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రో ధరల పెంచడంపై పర్వతగిరి, చింతనెక్కొండ, అన్నారం షరీఫ్, చౌటపెల్లి, కొంకపాక, ఏనుగల్ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా, రాస్తారోకోలు చేశారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జీపీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. సర్పంచ్లు చింతపట్ల మాలతీరావు, గటిక సుష్మా, గౌరారపు ఉమ, ఎంపీటీసీలు మట్టపెల్లి లావణ్య, మౌనిక రాజు, సుభాషిణి-వాసు, మాడ్గుల రాజు, కోల మల్లయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వెంకన్న, వంశీ, బాబు, సాంబయ్య, గటిక మహేశ్ పాల్గొన్నారు.